Heat wave:తెలంగాణలో ఉగ్రరూపం చూపిన సూర్యుడు..జాగ్రత్త..!
దేశంలో పలు రాష్ట్రాల్లో సూర్యుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండవేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఇటు ప్రజలను అటు పశుపక్ష్యాదులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న ఎండలతో చాలామంది అనారోగ్యంకు గురవుతున్నారు. తాజాగా వడగాలులు కూడా వీస్తుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందంటూ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వాతావరణశాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. క్రమంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ అలర్ట్ను జారీ చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఈ మూడు రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిక్కిం, జార్ఖండ్, ఒడిషా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ సారి వేసవి కాలం సాధారణ స్థాయికంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది.అయితే భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పశ్చిమ దిశ నుంచి వచ్చే ఉరుములతో కూడిన వర్షాలతో వాతావరణం సాధారణ స్థితిలో ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. పంజాబ్,హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో టెంపరేచర్లు సాధారణ స్థితిలో ఉండే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇదిలా ఉంటే సోమవారం రోజున పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇక దేశవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను చూస్తే... తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత యూపీలోని సుల్తాన్పూర్లో 43 డిగ్రీల సెల్సియస్, బీహార్లోని సుపాల్లో 42.4 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదు కాగా, ప్రయాగ్రాజ్, ఝాన్సీ, కాన్పూర్, ఆగ్రా, పాట్నా, ఈస్ట్ చంపారన్, భాటిండాల్లో 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.












Click it and Unblock the Notifications