Rains: శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ.. నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు..
రాష్ట్ర రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే మూడు రోజులు తెలంగాణలో తేలిపాటి నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళ, బుధ, గురువారాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వివరించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతుందని హైదరాబాద్ వాతావణ శాఖ వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడేందుకు ఎక్కువగా అవకాశం ఉందని అంచనా వేసింది.

నేడు జగిత్యాల జిల్లా, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, కామారెడ్డి, నాగర్కర్నూలు, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సూర్యాపేట, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాత కొరత ఉన్నట్లు తెలిపింది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయినట్లు వివరించింది. కొద్ది రోజులుగా ముఖం చాటేసిన వానలు.. మళ్లీ పడతాయని వాతావరణం శాఖ చెప్పడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రేపు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడాతాయని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది.












Click it and Unblock the Notifications