సచివాలయాన్ని కూల్చొద్దు: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు గడువు
హైదరాబాద్: సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలని తలచిన కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్త భవనాలను కట్టడాన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఈ విషయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సచివాలయ భవనాలను కూల్చివేసి, కొత్త భవనాలను కట్టడమంటే వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం అవుతుందని పిటిషన్ దారుడి తరపు న్యాయవాది వాదించారు.
ఈ క్రమంలో సచివాలయ భవనాల కూల్చివేతపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది. తదుపరి విచారణను 10రోజులు వాయిదా వేసింది. అప్పటి వరకు భవనాలను కూల్చొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భద్రతాపరమైన కారణాలు, ఫైర్ సేఫ్టీ, వెంటిలేషన్ సరిగా లేకపోవడం తదితర కారణాలతో ఇప్పటి సచివాలయ భవనాలను కూల్చివేసి నూతన భవనాలను నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సచివాలయ భవనాల్లోని కార్యాలయాల తరలింపు కూడా ప్రారంభించింది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడినందున ప్రత్యేక ఆకర్షణగా సచివాలయం ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, హైకోర్టుకు ఈ మేరకు ప్రభుత్వ అడ్వోకేట్ జనరల్ తన వాదనను వినిపించారు. ఇప్పటి వరకు సచివాల కూల్చివేతపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని కోర్టు తెలిపారు.
ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించడమంటే
పెద్ద ఎత్తున ప్రజల ధనం దుర్వినియోగం చేయడమేనని కోమటిరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రానికి సచివాలయంతో ఇబందేంటని కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వాస్తు బాగోలేదనే సీఎం కేసీఆర్ సచివాలయాన్ని పునర్నించాలని తలచినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఉన్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని నిర్మించడంతో వేల కోట్ల రూపాయల దుర్వినియోగం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications