BJP: బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతి.. కానీ..!
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై బీజేపీ చేపట్టేబోయే మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. 500 మందితో ధర్నా చేసుకోవచ్చని చెప్పింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. సాయంత్రం 4 గంటలకు ధర్నా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర బీజేపీ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని స్పష్టం చేసింది.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై నిరసనలు జరుగుతున్నాయని, రాజకీయ పార్టీలకు కూడా నిరసనలు తెలిపే హక్కు ఉంటుందన హైకోర్టు గుర్తు చేసింది. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ధర్నాచౌక్ వద్ద నిరసనలు తెలియజేస్తారని పేర్కొంది. ధర్నాచౌక్ వద్ద అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ నిరసన తెలియజేయాలని నిలదీసింది. ఆర్టికల్ 19 ప్రకారం నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి తేల్చి చెప్పింది.
శుక్రవారం సాయంత్రం 4 గంటలలోపు పోలీసులు ధర్నాకు అనుమతి ఇస్తారా లేదా చెప్పాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు పోలీసులు మహా ధర్నాకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది బండి సంజయ్ అంశాన్ని లేవనెత్తారు. సిట్ నోటీసులు జారీ చేస్తే బండి సంజయ్ సహకరించడం లేదన్నారు. అంతకు ముందు బీజేపీ మహా ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీజేపీ పోలీసులను అనుమతి కోరింది. అయితే వారు అనుమతి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై నిరసనలు జరుగుతున్నాయి. ఓయూలో విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓయూ వస్తాడన్న సమాచారంతో ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.