పరిష్కారాలతో రండి: ఏపీ-టీలకు హైకోర్టు, దర్యాఫ్తు ఆఫీసర్ని మార్చండి.. 'అగ్రిగోల్డ్'పై ఫైర్
హైదరాబాద్: కేవలం రుణమాఫీతోనే రైతు ఆత్మహత్యల నివారణ సాధ్యం కాదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో రైతు ఆత్మహత్యల పైన విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆత్మహత్యలపై జనవరి 4వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని కోర్టు ఆదేశించింది.
రైతు ఆత్మహత్యల పైన నిపుణుల కమిటీ వేయాలని హైకోర్టు సూచించింది. రుణమాఫీతోనే ఆత్మహత్యల నివారణ సాధ్యం కాదని పేర్కొంది. రైతు ఆత్మహత్యల పైన అన్ని అంశాలపై చర్చించి, పరిష్కార మార్గాలతో రావాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. ఆత్మహత్య మూలకారణాలపై చర్చించాలని సూచించింది.
రైతు ఆత్మహత్యల పైన తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. హైకోర్టు నేతృత్వంలోనే నిపుణుల కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. పంట కోసం తీసుకున్న రుణాలు, పంట నష్టం వల్లే ఆత్మహత్యలు అని చెప్పారు.
అగ్రిగోల్డ్ కేసు విచారణ తీర్పుపై హైకోర్టు సీరియస్
హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసు విచారణ తీరు పైన హైకోర్టు సీరియస్ అయింది. సిఐడి దర్యాఫ్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణమే దర్యాఫ్తు అధికారిని మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. కేసును నీరుగార్చుతున్నారని చెప్పింది.
ఈ కేసులో ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించారని, రెండు నెలల నుంచి ఎవరినీ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఆస్తుల వేలాన్ని పదిహేను రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించింది. సీ1 సంస్థ వెనుక అనుమానాలు వ్యక్తం చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది.