హీరోయిజమా?: పోలీసులపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టడం పైన హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు హీరోయిజాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారా అని పోలీసులను తీవ్రంగా హెచ్చరించింది. కేసు దర్యాఫ్తు సమయంలో నిందితుల్ని మీడియాలో చూపడం ద్వారా వారు నేరస్థులనే భావన సాధారణ జంలోకి వెళ్తుందని హితవు పలికింది. విచారణ పూర్తయి వారిని నిరపరాధులుగా కోర్టు ప్రకటించినా.. వారు నేరస్థులనే భావన సమాజంలో ఉండి పోతుందని చెప్పింది.
వరంగల్ జిల్లాలో 2008 డిసెంబర్లో జరిగిన యాసిడ్ దాడి కేసులో ఇద్దరు విద్యార్థులు సహా ముగ్గురి ఎన్కౌంటర్ కేసులో అప్పటి ఎస్పీ వీసీ సజ్జనార్, ఇతర పోలీసులపై హత్య కేసు నమోదుచేయాలని సీబీఐని ఆదేశించాలని కోరుతూ ఏపీ పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి క్రాంతి చైతన్య దాఖలు చేసిన పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
పిటిషనర్ తరఫున వి రఘునాథ్ తన వాదనలు వినిపించారు. యాసిడ్ దాడి కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని మీడియా ముందు హాజరుపరిచారని, అనంతరం మామునూరు కొండల్లోకి తీసుకువెళ్లి అక్కడ పోలీసుల నుండి తప్పించుకుని పారిపోతుంటే కాల్చిచంపినట్టు పోలీసులు కట్టుకథ అల్లారని ఆరోపించారు.

స్థానిక పోలీసులు నిర్వహించిన ఉత్సవాల్లో కూడా అధికారులు పాల్గొన్నారని ఆరోపిస్తూ పిటీషనర్ తరఫున కొన్ని ఫొటోలను సమర్పించారు. అందులో అప్పటి ఎస్పీ మిఠాయిలు పంచుకుంటున్నట్టు ఉన్నవి సమర్పించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడం మంచిది కాదన్నారు. న్యాయస్థానాల నుండి ప్రత్యేకమైన ఉత్తర్వులు లేనపుడు మీడియా ముందు నిందితులను ఎలా హాజరుపరుస్తారని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఈ విషయంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. యూనిఫారంలో ఉన్న ఒక అధికారి ఒక కేసుకు సంబంధించి స్వీట్లు పంచుకోవడం మంచిది కాదని, ముగ్గురు యువకుల ఎన్కౌంటర్పై కేసు నమోదు చేయకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయస్థానం పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి కొంతమంది సదరు అధికారి ఛాంబర్కు వచ్చి అభినందనలు తెలిపినపుడు ఏమీ అనలేకపోయారని అంతకు మించి ఏం జరగలేదని ఎస్పీ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు బెంచ్ ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేయమని ఆదేశించిందని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
అయితే ఈ కేసుపై 2010లో సుప్రీంకోర్టు స్టే విధించిందన్నారు. అయితే మరో కేసులో 2014లో సుప్రీంకోర్టు ఇలాంటి అసహజ పోలీసు కాల్పుల్లో మరణించిన ఘటనలపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని ఆదేశించిందని మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. వచ్చే వారం ఈ కేసుపై వాదనలు విననున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు పోలీసుల తీరును తప్పు పట్టింది. ఈ వ్యవహారం చూస్తుంటే మీ హీరోయిజం ప్రదర్శించినట్టుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.












Click it and Unblock the Notifications