తెలంగాణకు అలర్ట్: మండిపోతున్న ఎండలు, 45 డిగ్రీల పైనే నమోదు, మరో 3 రోజులు
హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు.. ఇప్పుడు సూర్యుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 9 గంటల తర్వాత.. సాయంత్రం 6 గంటలకు ముందు బయటికి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు వడగాలులు వీస్తుండటంతో బయటికి వెళ్లిన జనాలు చెమటలు కక్కుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కాగా, తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 15, 16, 17వ తేదీల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుమారు 42°C నుంచి 44°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలో 40°C నుంచి 42°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలులు భారీగా వీయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి, మండల అధికారులకు ఉన్నతాధికారులు సూచనలు జారీ చేశారు.
ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటికి వెళ్లొద్దని సూచించారు. కాగా, ఆదివారం పలు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
మంచిర్యాల జిల్లా కొండాపూర్లో గరిష్టంగా 45.9 డిగ్రీలు, జన్నారంలో 45.8, జగిత్యాల జిల్లా జైనాలో 45.5, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.4, నిజామాబాద్ జిల్లా ముప్కల్లో 45.1, నల్గొండ జిల్లా పజ్జూరులో 45, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురిమెల్లపాడులో 44.9, ములుగు జిల్లా గంగిపల్లిలో 44.8, ఆదిలాబాద్ జిల్లా ఆర్తి(టీ)లో 44.8, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్లో 44.8, కరీంనగర్ జిల్లా గంగిపల్లిలో 44.8, నిర్మల్ జిల్లా బుట్టాపూర్లో 44.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications