పెళ్లి కాకుండా గర్భం దాల్చిన యువతి: కడుపుకోసి హత్య చేశారు
హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య జరిగింది. పెళ్లి కాకుండా కూతురు గర్బం దాల్చడంతో పరువు కోసం తల్లి ఆ దారుణానికి ఒడిగట్టింది. కుమారులతో కలిసి ఓ తల్లి కూతురిని హత్య చేసింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం మైసిగండి గ్రామపంచాయతి పరిధిలోని వెలుగురాళ్ల తండాలో ఈ ఘోరం చోటుచేసుకుంది.
ఈ నెల 12వ తేదీన ఆ సంఘటన చోటు చేసుకుంది. కాగా అది శుక్రవారం వెలుగుచూసింది. తండాకు చెందిన ఇస్లావత్ దేవ్లా, సోనిలకు ఒక కూతురు, ముగ్గురు కుమారులున్నారు. తండ్రి దేవ్లా మరణించడంతో వారి కూతురు ఇస్లావత్ మంజుల(19) కొంతకాలంగా నల్లగొండ జిల్లా దేవరకొండలోని బంధువుల ఇంట్లో ఉంది.

వారం క్రితం మంజుల వెలుగురాళ్ళకు చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం మంజుల కడుపు ఉబ్బెత్తుగా కనిపిస్తోందని తల్లి మంజులను నిలదీసింది. గర్భం దాల్చిన సంగతి నిజమేనని మంజులు అంగీకరించింది. అయితే దానికి కారకులు ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు. దీంతో సోని తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైంది. కుమారులు బబ్లు, జగన్ల సాయంతో మంజులను పొలం వద్దకు తీసుకుని వెళ్లింది.
ఎలా జరిగిందని అడుగుతూ ముగ్గురు మంజులను కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత మంజుల పొత్తి కడుపు ప్రాంతంలో కత్తితో కోసి హత్య చేశారు. ఆ తర్వాత నోట్లో పురుగుమందు పోసి ఆత్మహత్యకు పాల్పడిందని తండా వాసులకు చెప్పారు.
గురువారం మంజుల మృతదేహాన్ని తమ వ్యవసాయ పొలంలో పూడ్చిపెట్టారు. విషయం చివరకు పోలీసులకు చేరింది. మంజుల తల్లి సోనిని మంజుల మృతిపై పోలీసు అధికారులు ఆరా తీశారు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చినందుకు మందలించడంతో మంజుల ఆత్మహత్యకు పాల్పడిందని సోని తెలిపింది. అయితే మంజుల మృతదేహాన్ని బయటకుతీసి చూడగా తలపై తీవ్ర గాయాలు, పొత్తికడుపుపై కత్తితో కోసిన అనవాళ్ళు కనిపించాయి.
దీంతో మంజులది ఆత్మహత్య కాదు పథకం ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. తహసీల్దార్ రవికుమార్, వీఆర్వో భారతి, ఏసీపీ అనురాధరెడ్డిల సమక్షంలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి కృష్ణ శవపరీక్ష నిర్వహించారు. మంజుల తల్లి సోని, సోదరులు జగన్, బబ్లులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications