భయం గుప్పిట్లో హైదరాబాద్, కూలిన ఇల్లు: సచివాలయానికి కెసిఆర్
హైదరాబాద్ : ఎడతెరిపి లేని వర్షాలకు హైదరాబాదు నగరం భయం గుప్పిట్లో చిక్కుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రజల్లో చోటు చేసుకుంది. శనివారంనాడు కుషాయిగుడాలోని ఎల్లారెడ్డి గుడాలో ఓ పురాతనమైన ఇల్లు కూలింది. ఈ ఘటనలో 14 ఏళ్ల బాలిక గాయపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఫోటో గ్యాలరీ : హైదరాబాద్ జలమయం
పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయన శనివారంనాడు సచివాలయానికి చేరుకున్నారు. అయితే, నగరంలో వర్ష ప్రభావం కొనసాగుతూనే ఉంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో శనివారం కూడా చిరు జల్లులు కురుస్తూ జనానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి.
వాననీటికి రోడ్డు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఉద్యోగస్తులు కార్యాలయాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు జిల్లా పరిధిలోని ముషీరాబాద్, మారేడుపల్లి మండలాల్లో సుమారు 8 ఇండ్లు పూర్తిగా, మరో 24 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జలమయమైన ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచనల మేరకు తహసీల్దార్లు సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు. అలాగే మరో 95 ఇండ్లలోకి నీరు చేరడంతో అప్రమత్తమైన రెవెన్యూ, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు నీటిని నాలాల్లోకి మళ్లించారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇండ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అధికారులు తెలిపారు.
శిథిల భవనాలు తొలగించారు...
శిథిల భవనాల కూల్చివేతలో భాగంగా శుక్రవారం వివిధ ప్రాంతాల్లో 48 భవనాలను తొలగించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి తెలిపారు. ఈనెల 12నుంచి ఇప్పటివరకు 132భవనాలను కూల్చివేశామని తెలిపారు. ప్రస్తుత సీజన్లో మొత్తం 416 భవనాలను కూల్చివేసినట్లు, పలు భవనాలకు మరమ్మతులు చేయడంతోపాటు కొన్నింటిని సీజ్ చేసినట్లు కమిషనర్ వివరించారు.
నగరంలో రికార్డు స్థాయిలో వాన
నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబరు 1నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 6.2 మిల్లిమీటర్ల మేర వర్షం కురవాల్సి ఉండగా 57.7 మిల్లిమీటర్లు కురిసింది. దీంతో పోల్చితే బే గంపేట వాతావరణ శాఖ లెక్కల ప్రకా రం 831శాతం మే ర అత్యధిక వర్షాలు పడినట్లు సమాచారం.
చెట్టు కూలి మీద పడి యువకుడి మృతి
డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై కూలిన చెట్టుకు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సికింద్రాబాదులోని బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. అల్వాల్ వెస్ట్ వెంకటాపూర్కు చెందిన ఎస్.రవి (34) మొలుగులోని ఆర్వీఎం మెడికల్ కళాశాలలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా రిసాలబజార్ వాటర్ ట్యాంక్ కోటేశ్వర్ ఆలయం వద్దకు రాగానే రోడ్డుపై పడి ఉన్న చెట్టును ఢీకొట్టి కిందపడి పోయాడు.
ఆస్పత్రిలో మరణించిన యువకుడు
బొల్లారం ప్రాంతంలో తీవ్రగాయాలైన యువకుడిని చికిత్స నిమిత్తం 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు అయితే, చికిత్సపొందుతూ మృతి చెందాడు. ప్రధానరోడ్డుపై పడిఉన్న చెట్లను ఆర్అండ్బీ, కంటోన్మెంట్ అధికారులు నిర్లక్ష్యంగా వదిలివేయడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్కడ గోడ కూలింది..
భారీ వర్షాలతో ఐ మ్యాక్స్ ఎదురుగా ఉన్న బస్తీలోని ఓ ఇంటి గోడ కుప్పకూలింది. పెయింటింగ్ పనిచేసుకున్న వెంకటయ్య తన కుటుంబంతో కలిసి ఓ పాత ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి కురిసిన వర్షంతో మట్టిగోడ పూర్తిగా నాని శుక్రవారం ఉదయం కూలిపోయింది. అయితే, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఖైరతాబాదులో పర్యటించిన దత్తాత్రేయ
భారీవర్షాల కారణంగా నీటితో అల్లాడుతున్న ఖైరతాబాద్లోని పలు ప్రాం తాల్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం పర్యటించారు. ఇంద్రానగర్, ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్తో పాటు పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేతో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోడ కూలిన వెంకటయ్య ఇంటిని పరిశీలించిన ఆయన ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బాధితులకు విజయారెడ్డి సాయం
జిహెచ్ఎంసి అధికారులు, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి సైతం ఆయా ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. మరో మూడురోజులు భారీ వర్ష సూచన ఉన్న నేపధ్యంలో పురాతన ఇళ్లలో నివసించే వారు ఖాళీ చేయాలని జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కోరారు.
వరద ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్..
వర్షాలతో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్న ప్రాంతాలను డిప్యుటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పరిశీలించారు. శుక్రవారం ఉదయం డిఎంసి అశోక్ సామ్రాట్, ట్రాఫిక్ ఏసిపి మాసూమ్ బాషాలతో కలిసి ఆయన పర్యటించారు. నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు జరిపించాలని ఆదేశించారు.