బిడ్డకు చెత్త అని చెప్పి భార్య శవం ముక్కల సూట్కేస్తో టెక్కీ ఇలా....
హైదరాబాద్: తాము నివసిస్తున్న ఫ్లాట్ నుంచి రూపేష్ అగర్వాల్ తన భార్య సింథియా శవం ముక్కల సూట్కేసును గుట్టు చప్పుడు కాకుండా తరలించినట్లు సమాచారం. బయటకు ఏ మాత్రం పొక్కకుండా హత్య చేసి, అంతే రహస్యంగా శవం ముక్కలను శంషాబాద్ మండలంలోని మదనపల్లి వద్ద గల నిర్మానుష్యమైన ప్రదేశానికి తరలించి కాల్చేశాడు.
గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్ సిటీ వ్యూ అపార్టుమెంటులో రూపేష్, సింథియా, వారి కూతురితో పాటు సింథియా సోదరుడు కూడా ఉంటున్నాడు. రూపేష్ అపార్టుమెంటులో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని తెలుస్తోంది. హిందీ, తెలుగు రాకపోవడంతో సింథియా కూడా బయటకు వచ్చేది కాదని సమాచారం.
జైన్ శిల్ప సైబర్ సిటీ అపార్టుమెంటులోని రమణారావుకు చెందిన గ్రౌండ్ ఫ్లోర్లోని జి ఫ్లాట్ అద్దెకు తీసుకని గత రెండేళ్లుగా రూపేష్ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే రూపేష్ ప్రతి రోజు ఉదయం 10 గంటలకు వెళ్లి సాయంత్రం ఏడు గంటలకు తిరిగి వచ్చేవాడని చెబుతున్నారు.
సింథియా సోదరుడు బిటెక్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం ఫంక్షన్కు వెళ్లిన రూపేష్, సింథియా, సానియా తిరిగి రాగా, సింథియా సోదరుడు మిత్రుల వద్దకు వెళ్లాడు. తన సోదరి హత్య గురించి తెలియని సింథియా సోదరుడు సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఫ్లాట్కు వచ్చాడు. తాళం చెవి లేకపోవడంతో ఆపార్టుమెంటులోనే అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు.
మీడియా ప్రతినిధులు రావడంతో విషయం తెలిసి అతను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సింథియాను హత్య చేసిన రూపేష్ తన ఫ్లాట్కు సమీపంలోనే లిఫ్ట్ ఉండడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కారు లిఫ్ట్ సమీపానికి వచ్చే అవకాశం కూడా ఉంది. కూతురుకు చెత్త అని చెప్పి భార్య శవం ముక్కలు ఉన్న సూట్కేసును కారులో పెట్టుకుని వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు.
ఆపార్టుమెంట్లో సిసి కెమెరాలు లేవు. దీంతో అతను ఏ సమయంలో వెళ్లాడనేది తెలియడం లేదు. హిందీ, తెలుగు రాకపోవడంతో సింథియా ఎవరితోనూ మాట్లాడేది కాదు. కూతుర్ని ప్రతి రోజు స్కూల్ బస్సు ఎక్కించేదని చెబుతున్నారు.