హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా ; నష్టం బీజేపీకా, టీఆర్ఎస్ కా ? కాంగ్రెస్ కి మాత్రం రిలీఫ్ !!
తెలంగాణ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే హోరాహోరీగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం కొనసాగిస్తున్న ఈ సమయంలో ఈసీ ఇచ్చిన షాక్ అన్ని రాజకీయ పార్టీలకు తగిలినప్పటికీ , ఈసీ తాజా నిర్ణయంతో ఏ పార్టీకి లాభం చేకూరుతుంది? ఏ పార్టీకి నష్టం జరుగుతుంది ? అన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. హుజురాబాద్గ ఉప ఎన్నిక ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్ అన్నట్టు మారటంతో ఉప ఎన్నిక విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అయిన క్రమంలో ఊహించిందే జరిగింది అంటున్నారు కొందరు రాజకీయ వర్గాల నాయకులు .
Rashmi gautham: మోడరన్ డ్రెస్ లోనే కాదు, చీరలో కూడా అందాలు ఆరబోస్తున్న జబర్దస్త్ బ్యూటీ (ఫొటోస్)
హుజురాబాద్ లో పీక్స్ లో పొలిటికల్ హీట్
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో టిఆర్ఎస్ పార్టీలో మంత్రిగా కీలకంగా పనిచేసిన ఈటెల రాజేందర్ భూ అక్రమాలకు పాల్పడ్డారని, అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపణలు చేసి మంత్రిగా ఆయనను తొలగించి, అవమానకర రీతిలో పార్టీ నుండి బయటకు పంపించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఇక అప్పటి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల వేడి పీక్స్ కి చేరుకుంది.
హుజూరాబాద్ పై పట్టు బిగించే క్రమంలో సీఎం కేసీఆర్
హోరాహోరీగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి.అధికార పార్టీ నుండి మంత్రులు రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని వర్గాలనూ గులాబీ నేతలు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించి దళిత ఓటు బ్యాంకు తమ ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు .ఇక అభివృద్ధిలోనూ హుజురాబాద్ నియోజకవర్గాన్ని జెట్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కనీవినీ ఎరుగని విధంగా నిధుల వరద కురిపిస్తున్నారు. అభ్యర్థిగా బీసీ యువ నాయకుడు గెల్లు శ్రీనివాస్ పేరును ప్రకటించి బీసీల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టారు.
ఎన్నికల ప్రచారంలో రివర్స్ అటాక్ చేస్తున్న ఈటల రాజేందర్ కు ప్రజల్లో సానుకూలత
ఇదిలా ఉంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి తన కారణంగానే జరుగుతుందని, తాను రాజీనామా చేయడం వల్లనే సీఎం కేసీఆర్ నిధుల వరద కురిపిస్తున్నారని ఈటెల రాజేందర్ ప్రజాక్షేత్రంలో ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పాలనపై విరుచుకుపడుతున్నారు. తనపై కేసీఆర్ పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతున్నారు. గెలవలేక తనను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. నియోజకవర్గం లో ఎక్కడికి వెళ్ళినా ఈటల రాజేందర్ కు మంచి ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ కు అనుకూల పవనాలు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉన్నాయని జోరుగా చర్చ జరుగుతోంది.
ఈటలకు ఇప్పుడు బలమైన గాలి .. టీఆర్ఎస్ కు ప్రతికూల వాతావరణం
ఈటల రాజేందర్ కు బలమైన గాలి వీస్తున్న సమయంలో నోటిఫికేషన్ వస్తే బీజేపీ గెలుస్తుందని, ఆలస్యం జరిగితే అది టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక జరిగితే ఎవరు గెలుస్తారనే దానిపై ఇంటలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నట్లు సమాచారం. హుజూరాబాద్ నియోజకవర్గం లో సీఎం కేసీఆర్ కు, టిఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన పరిస్థితులు లేవని రిపోర్ట్స్ వచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక ఇదే సమయంలో కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి అంటూ, అందుకు ఎన్నికల ప్రచారం కారణమంటూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ గతంలో వెల్లడించిన క్రమంలోనే బిజెపి నేతలు ఈ అనుమానాలను వ్యక్తం చేశారు. కరోనా బూచిని సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేసేలా చేస్తారేమో అని అనుమానాలు వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్టు తెలంగాణా ప్రభుత్వం పండుగల తర్వాత ఉప ఎన్నిక నిర్వహించాలని కోరిందని, కరోనా నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఈసీ చెప్పటం గమనార్హం .
ఎన్నికల వాయిదాతో బీజేపీకి నష్టం జరిగే ఛాన్స్ .. ట్రెండ్ మారుతుందా ?
ఈ క్రమంలో తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక ఇప్పట్లో లేదని ఈసీ వెల్లడించడం బీజేపీకి షాక్ అనే చెప్పాలి. కరోనా కారణంగా చూపి ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు చెప్పటం బీజేపీకి ఇబ్బందికర పరిణామం. ఒకపక్క పశ్చిమ బెంగాల్ లో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ఈసీ కేవలం తెలంగాణలో ఒక్క స్థానానికి ఎన్నిక వాయిదా వెయ్యటంపై ఇప్పుడు తెలంగాణలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటల రాజేందర్ కు అనుకూలంగా ఉన్న వాతావరణం, తరువాత మారే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఉండే ట్రెండ్, ఎన్నికలు జాప్యం జరిగితే ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులలో కూడా వ్యక్తమవుతోంది.
Recommended Video
టీఆర్ఎస్ కు పెద్దగా నష్టం లేదు.. బీజేపీకే బిగ్ షాక్ .. కాంగ్రెస్ కు కాస్త రిలీఫ్
ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పెద్ద ఎత్తున సన్నాహాలు చేసిన టిఆర్ఎస్ పార్టీని ఒకింత నిరాశకు గురి చేయగా, టీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం లేదని చెప్పాలి. ఇప్పటికే కేసీఆర్ పై వ్యతిరేక ప్రచారంలో ముందుకు సాగుతున్న, హుజురాబాద్ లో ప్రజల సానుభూతి కోసం తెగ ప్రయత్నం చేస్తున్న ఈటల రాజేందర్ కు, బిజెపి కి మాత్రం పెద్ద షాక్ అని చెప్పాలి. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ గెలుస్తారని బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెప్పిన వేళ ఎన్నికల వాయిదా నిర్ణయం బీజేపీ నేతలకు రుచించటం లేదు. ఇక ఇప్పటి వరకు అభ్యర్ధి విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న, అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా కాస్త రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు.