పెను విషాదం: స్కూల్ గోడ కూలి ఇద్దరు విద్యార్థినుల మృతి, మరో ఐదుగురికి తీవ్రగాయాలు
హైదరాబాద్: యాజమాన్యం నిర్లక్ష్యంగా కారణంగా కూకట్పల్లిలోని న్యూ సెంచరీ పబ్లిక్ పాఠశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాల షెడ్డు కూలి మణి కీర్తన, చందన అనే విద్యార్థులు మృతి చెందారు. మరో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
డ్రిల్ పిరియడ్లో పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో కరాటే నేర్పించే సమయంలో ఈ ఘోరం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు పాడయ్యాయి. డ్రిల్మాస్టర్ కరాటే నేర్పిస్తుండగా గోడ కూలింది. షెడ్డు గోడ కూలిన సమయంలో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు విద్యార్థుల తలలకు తీవ్రంగా గాయాల పాలవ్వడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వైద్యుల చికిత్సకు స్పందించలేదు. వైద్యం చేస్తుండగానే వారిద్దరూ మరణించారు. గాయపడ్డ సహస్ర, నిఖిత, దివ్యశ్రీ, నరేశ్, సందీప్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఆస్పత్రి ప్రాంగణం వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అక్కడ పరిస్థితి హృదయవిదారకంగా మారింది.
పాఠశాలకు చేరుకున్న పోలీసులు డ్రిల్మాస్టర్ను, యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.