గ్రూప్-4 పరీక్ష రాస్తూ సెల్ఫోన్తో పట్టుబడ్డ అభ్యర్థి
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష రాస్తూ సెల్ఫోన్తో ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. సరూర్నగర్లోని సక్సెస్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు పకడ్బంధీగా తనిఖీలు చేసినా.. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్ ఎలా తీసుకెళ్లారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత ఇన్విజిలేటర్ గుర్తించి.. అభ్యర్థి నుంచి ఫోన్ తీసుకుని సీజ్ చేశారు.
మాల్ ప్రాక్టీస్ కింద అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం సెషన్లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. కాగా, గ్రూప్-4 పరీక్షా కేంద్రంలోకి ఫోన్ తీసుకురావడం కలకలం రేపింది.

మరోవైపు, రాష్ట్రంలో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. 8180 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష రాశారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షను అభ్యర్థులు రాస్తున్నారు. కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోవడంతో నిర్వాహకులు వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దీంతో వారు నిరాశతో అక్కడ్నుంచి వెనుదిరిగారు.
కాగా, గ్రూప్-4 పరీక్ష నేడు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పలు కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే.పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు ఉదయం 9.45 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.15 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందని టీఎస్పీఎఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవల పలు పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఎదురైన అనుభవాల దృష్ట్యా టీఎస్పీపీఎస్సీ కీలక సూచనలు చేయడంతోపాటు పలు అంశాలపై స్పష్టతనిచ్చింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్న తర్వాత ఇన్విజిలేటర్కు అభ్యర్థులు తమ ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు.
మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నిబంధన పెడుతున్నారని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పలు పరీక్షలకు హాజరైన మహిళ అభ్యర్థుల తాళి బొట్టు, మెట్టెలు, చెవి దుద్దులు కూడా తీసేయించి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పరీక్ష పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని రూల్స్ ఏమీ లేవని ఆయన స్పష్టంచేశారు. యువతీయువకుల కోసం ప్రత్యేకంగా చెక్ పాయింట్లు ఉంటాయని, అందుకు సరిపడా మహిళా సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు.












Click it and Unblock the Notifications