భార్య ఆత్మహత్య: నిలదీసిన బావమరిదిని చంపేసిన బ్యాంక్ చీఫ్ మేనేజర్
హైదరాబాద్: అతనో బ్యాంక్ చీఫ్ మేనేజర్. భార్య ఆత్మహత్య చేసుకుంది. బావమరిదిని చంపేశాడు. కటకటాల పాలయ్యాడు. వేధింపుల కారణంగా భార్య చనిపోయింది. ఆ విషయంపై నిలదీసిన బావమరిదిని అతను చంపేశాడు. అతన్ని హైదరాబాదులోని మీర్పేట పోలీసులు అరెస్టు చేశారు.
ఇన్స్పెక్టర్ రంగస్వామి సోమవారం వివరాలు వెల్లడించిన వివరాల ప్రకారం - కర్ణాటకకు చెందిన పి.వెంకటకృష్ణమూర్తి(45), భార్య సవితాలక్ష్మి(30), ఇద్దరు పిల్లలతో కలిసి అల్మాస్గూడ 9వ వార్డు పరిధిలోగల ఎస్ఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్నాడు.
ఇండియన్ బ్యాంక్ ఐటి విభాగం చీఫ్ మేనేజర్గా గతంలో పనిచేసిన ఆయన చెన్నైకి ఇటీవల బదిలీ అయ్యాడు. 2000 సంవత్సరంలో శారద అనే యువతితో వివాహమైంది. అయితే కుటుంబ కలహాల కారణంగా 2007లో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది.
2011లో సవితాలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇది రెండో వివాహం వారికి 4 ఎళ్లు, 4నెలలు వయస్సు గల ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. చీటికీ మాటికీ భర్త గొడవ పడుతుండడంతో అక్టోబర్ 23వ తేదీన ఆమె ఆత్మ హత్యాయత్నం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం మరణించింది.
సవితాలక్ష్మి సోదరుడు టి.మాణిక్యరావు(38) కర్ణాటకలో ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. ఆమె ఆస్పత్రిలో ఉండడంతో నగరానికి వచ్చాడు. సోదరి చనిపోవడంతో అంత్యక్రియల నిమిత్తం ఇక్కడే ఉన్నాడు. శనివారం అంత్యక్రియలు ముగిశాయి. నీ వేధింపుల కారణంగానే చనిపోయిందని బావ కృష్ణమూర్తిని మాణిక్యరావు నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దాంతో మాణిక్యరావును చంపేయాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రి భోజనాలు చేసి అందరూ నిద్రపోయారు. కృష్ణమూర్తి లేచి చార్జింగ్ పెట్టి ఉన్న బామ్మర్ది ఫోన్లోని సిమ్, మెమొరీ కార్డులు తీసి బయటపడేశాడు. అనంతరం బండ రాయితో మాణిక్యరావు తలపై మోది చంపేశాడు.
చప్పుడుకు నిద్రలేచిన కుటుంబసభ్యులు కృష్ణమూర్తిని పట్టుకోడానికి ప్రయత్నించగా పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు అల్మాస్గూడ శ్మశాన వాటికలో కృష్ణమూర్తి ఆదివారం తచ్చాడుతుండగా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో అతను నేరాన్ని అంగీకరించాడు.