హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం: 8వేల డ్రగ్ టాబ్లెట్స్ సీజ్, వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది. టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ విక్రయిస్తోన్న రాజేష్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీసీ ఎస్కే ఖురేషి మీడియాకు వివరాలు వెల్లడించారు.
నగరంలోని కొత్తపేటకు చెందిన రాజేశ్ను శుక్రవారం సాయంత్రం బిగ్బజార్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిద్రపోవడానికి ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. 8 వేల రెండు వందల యాభై మత్తు మందు టాబ్లెట్లు సీజ్ చేసినట్లు తెలిపారు.
కర్ణాటక రాష్ర్టంలోని రాయచూర్ నుంచి టాబ్లెట్స్ తెచ్చి రాజేష్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆటోడ్రైవర్లు, చిన్న చిన్న పనిచేసుకునే కార్మికులు, కొంత మంది వ్యాపార వేత్తలకు టాబ్లెట్లు సరఫరా చేస్తున్నాడని వివరించారు. అందరూ కూడా ఇతనికి తెలిసిన కస్టమర్లేనని పేర్కొన్నారు.
ఒక్కో టాబ్లెట్ను యాభై నుంచి వంద రూపాయలకు అమ్ముతున్నట్లు విచారణలో రాజేష్ తెలిపాడని చెప్పారు. పబ్బుల్లోనూ ఈ టాబ్లెట్లను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.