దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ .. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం
హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందా? అంబేద్కర్ కాలంలో ఒకసారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోనూ ఒకసారి తెరమీదకు వచ్చిన ఈ అంశం తాజాగా మరోమారు బిజెపి సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ వ్యాఖ్యలతో తెరమీదకు వచ్చింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మరోసారి దేశ రెండో రాజధాని హైదరాబాద్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావొచ్చు: ఢిల్లీ కాలుష్యంపై సీహెచ్ విద్యాసాగర్ రావు
దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ .. విద్యాసాగర్ రావు వ్యాఖ్యలు
ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పాలన కుంటుపడింది. ఇక ఇదే సమయంలో హైదరాబాదును దేశ రెండో రాజధానిగా చేయాలని నాడు అంబేద్కర్ చెప్పారని,ఆ విషయాన్ని తిరిగి బిజెపి సీనియర్ నాయకులు విద్యాసాగర్ రావు ప్రస్తావించడం కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తోందా అన్న అనుమానానికి ఊతం ఇస్తోంది. సాధారణంగా విద్యాసాగర్ రావు సంచలనాల కోసం మాట్లాడే వ్యక్తి కాదు, కానీ ఆయన ఆయన అలా మాట్లాడారంటే, బీజేపీ అధిష్ఠానమే ఆయనతో అలా మాట్లాడించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గత పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రస్తావన .. అన్ని పార్టీల మీటింగ్ జరగాలన్న మాజీ గవర్నర్
గత పార్లమెంట్ ఎన్నికల ముందు దేశ రెండో రాజధాని ప్రస్తావన వచ్చిందని, అయితే దీనిపై అన్ని పార్టీల మీటింగ్ జరగాల్సి ఉందని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఇప్పటివరకు కేంద్రంలో ఇలాంటి చర్చ జరగలేదన్న విద్యాసాగర్ రావు ప్రధానంగా ఢిల్లీలో పెరిగిపోయిన కాలుష్యం మాత్రమే దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ పేరు ప్రస్తావించడానికి కారణం కాదని, గతంలో అంబేద్కర్ కూడా హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా కావాలని చెప్పారని, అందుకు ఆయన సమగ్ర కారణాలను కూడా వివరించారని పేర్కొన్నారు.
విద్యాసాగర్ రావు వ్యాఖ్యలను సమర్ధించిన మాజీ ఎంపీ చింతా మోహన్
ఇక విద్యాసాగర్ రావు చేసిన రెండో రాజధానిగా హైదరాబాద్ అన్న వ్యాఖ్యలను సమర్థిస్తూ ఏపీలోని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాదును రెండో రాజధానిగా మార్చడానికి కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నదని, రెండవ రాజధానిగా మార్చడానికి హైదరాబాద్ కు ఉన్న వనరుల నేపథ్యంలోనే హైదరాబాదు పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుందని చింతా మోహన్ పేర్కొన్నారు.
ఢిల్లీ కాలుష్యం మాత్రమే కాదు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా ?
ఇక రాజకీయ విశ్లేషకులు సైతం ఢిల్లీలో భయంకరమైన కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో,అలాగే దక్షిణాదిన బీజేపీ బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలని భావిస్తున్న నేపథ్యంలో దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెక్ పెట్టినట్టు అవుతుందన్న భావన కూడా లేకపోలేదు. బీజేపీ దక్షినాది రాష్ట్రాల్లో బలోపేతం కావటానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి.
దేశ రెండో రాజధాని రగడపై సీపీఐ నేత నారాయణ ఫైర్
ఇక ఈ సమయంలో దేశ రెండో రాజధాని రగడ తెరమీదకు తీసుకురావటంపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెను పక్కదారి పట్టించేందుకే రెండో రాజధాని విషయాన్ని విద్యాసాగర్రావు తెరపైకి తెచ్చారని సీపీఐ నారాయణ అన్నారు. ఒకవేళ నిజంగా అలాంటి ఆలోచనే ఉంటే హైదరాబాద్ను రెండో రాజధాని చేయటానికి బీజేపీ నాయకత్వాన్ని ఒప్పించాలని కోరారు. విద్యాసాగర్రావుకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొనాలని తెలిపారు. ఆర్టీసీ సమ్మెను పక్కదారి పట్టించే ఈ అంశంపై చర్చ ఇప్పుడు అనవసరమని ఆయన పేర్కొన్నారు.