షాపింగ్ చేద్దామని భర్త తీసుకెళ్లాడు: మూటలో శవమై కనిపించింది..
హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ చేద్దామని భార్యను తీసుకెళ్లిన ఓ భర్త.. ఆమెను హత్య చేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి నుంచి బయటకెళ్లిన తర్వాత.. వారిద్దరి ఆచూకీ తెలియరాకపోవడం.. ఓ కాలువ వద్ద భార్య మృతదేహం లభ్యమవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. నారాయణగూడ కింగ్కోఠి ప్రాంతంలో నివసిస్తున్న జబానాజ్(30)కు ఆజంపురా డివిజన్ ఫర్హత్నగర్కు చెందిన అక్బర్అలీఖాన్కి 10ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉపాధి రీత్యా అక్బర్ రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు.
రంజాన్ సందర్భంగా నాలుగు రోజుల క్రితం అక్బర్ హైదరాబాద్ వచ్చాడు. ఈ నెల 19న అత్తగారింట్లో ఉన్న భార్యను తీసుకుని షాపింగ్ చేద్దామని వెళ్లాడు. అయితే రాత్రయినా వారికి సంబంధించిన సమాచారమేది తెలియరాలేదు. జబానాజ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆమె ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో జబానాజ్ తల్లి నారాయణగూడ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది.
ఇదే క్రమంలో డబీర్ పురా రైల్వే స్టేషన్ సమీపంలో పడేసి ఉన్న మూటలో మహిళ శవం ఉందని పోలీసులకు సమాచారం అందింది. అక్బర్ అలీఖానే ఆమెను హతమార్చి తిరిగి దుబాయికి వెళ్తున్నట్టు ఇంట్లోవాళ్లకు ఫోన్ చేసి చెప్పాడని కొంతమంది స్థానికులు తెలిపారు. అలీఖాన్ దొరికితేనే కేసు చిక్కుముడి వీడుతుందని పోలీసులు అంటున్నారు. అయితే అలీఖాన్ దుబాయి పారిపోయాడా? ఇండియాలోనే ఉన్నాడా? అన్నది తెలియాల్సి ఉంది.