రాంనగర్లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ప్రకటన
హైదరాబాద్: నగరంలోని అడిక్మెట్ డివిజన్ రాంనగర్లో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు అందడంతో హైడ్రా కూల్చివేతలకు దిగింది. మూడు ప్రత్యేక బృందాలుగా దాదాపు 70 మంది డీఆర్ఎస్ హైడ్రా కూల్చివేత ప్రత్యేక సిబ్బంది వచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. 1-9-18/9 సర్వే నెంబర్ గల స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపట్టారని గతంలో కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.
అదేవిధంగా రోడ్డును, నాలాలను కబ్జా చేసి, ఆ స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వీటిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.

ఆ నిర్మాణాలు అక్రమమే అని నిర్ధరించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు. ఫిర్యాదు ఇచ్చిన రెండ్రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా వరద నీరు వెళ్లేందుకు మార్గం మూసుకోవడంతో ఏటా వర్షా కాలంలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడం, ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికంగా పలు ఇబ్బందులు గురవుతున్నామని అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు చేపట్టలేదు. ఇక తాజాగా హైడ్రా చర్యలతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, తమ నిర్మాణాలకు అన్ని అనుమతులున్నా కూల్చివేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూల్చివేతలపై హైడ్రా స్పందన
రాంనగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంపై తాజాగా హైడ్రా స్పందించింది. మురుగునీటి వ్యవస్థకు అడ్డుపడుతూ అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే రాంనగర్ మణెమ్మ గల్లీలో ఆక్రమణలు కూల్చివేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మణెమ్మ గల్లీ వద్ద ప్రజా రోడ్డుపై ఆక్రమణ జరిగిందని, హైడ్రా అధికారుల సమక్షంలో ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ సిటీ ప్లానర్, రెవెన్యూ అధికారులతో స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.
ఈ పరిశీలనలో ఆక్రమణకు గురైన భూమి సర్వే నెంబరు 20,21 వార్డు 155 బ్లాక్ ఏ జమిస్తాన్పూర్ గ్రామంలో ఉన్నట్లు గుర్తించామని రంగనాథ్ తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమిలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కల్లు కంపౌండ్, తాత్కాలిక షెడ్తో పాటు జీ ప్లస్ 2 అంతస్తుల భవనాన్ని అనుమతి లేకుండా నిర్మించారని గుర్తించి, ఆ నిర్మాణాలను తొలగించినట్లు కమిషనర్ రంగనాథ్ వివరించారు.












Click it and Unblock the Notifications