శ్రీతేజ్ను అందుకే కలవలేకపోతున్నా.. అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబానికి అండగా ఉంటామని మరోసారి సినీనటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు. కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నందున శ్రీతేజ్ను కలవలేకపోతున్నానని అల్లు అర్జున్ తెలిపారు. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి గురించి ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. బాలుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అతడ్ని కలవలేకపోతున్నా. వాళ్ల ఇంటికి వెళ్లలేకపోతున్నా. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా. వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా అని అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

కాగా, సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీనటుడు అల్లు అర్జున్ శుక్రవారం అరెస్టై.. శనివారం ఉదయం విడుదలైన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అయితే, ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది.
కానీ, బెయిల్ పేపర్లు సరైన సమయంలో చంచల్గూడ జైలు అధికారులకు అందకపోవడం, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చిన బెయిల్ పేపర్లు సరిగాలేకపోవడంతో ఆయన శుక్రవారం అర్ధరాత్రి వరకు జైలులోనే ఉన్నారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బెయిల్ పేపర్లు జైలు అధికారులు అందాయి.
అర్ధరాత్రి కావడంతో శనివారం ఉదయం అల్లు అర్జున్ను జైలు అధికారులు విడుదల చేశారు. దీంతో నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు అల్లు అర్జున్. ఇక్కడ పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకున్నారు. కాగా, ఆదివారం మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు నివాసాలకు అల్లు అర్జున్ దంపతులు వెళ్లి వారిని కలిశారు.
శనివారం జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి ప్రాణాలు కోవడం బాధాకరమన్నారు. ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పారు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. 25 లక్షల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications