రాజకీయాల్లోకి నా బిడ్డల్ని రానివ్వను: వెంకయ్య నాయుడు సంచలన ప్రకటన
మన జీవితం సుస్థిరంగా ఉండాలంటే ప్రకృతితో సమన్వయంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. భారతీయ పండుగలు ప్రకృతి చక్రంతో విడదీయరాని బంధంతో ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్లో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయ వారసత్వంపై కీలక కామెంట్స్ చేశారు.
పంటలు ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండుగను జరుపుకోవడం భారతీయ సంప్రదాయంలోని విశిష్టతని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల ప్రభావంతో ఋతువుల స్వభావమే మారుతున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ని మార్పులు వచ్చినా, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మూలాలను మరిచిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం స్వర్ణభారత్ ట్రస్ట్లో పండుగల వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నేనేప్పుడూ వారసత్వాన్ని ప్రోత్సహించలేదు..
తాను దేశానికి ఉపరాష్ట్రపతిగా రాణించినా తన కుటుంబం నుంచి రాజకీయంగా ఎవరు ముందుకు రాకపోవడానికి గల కారణాలను వెంకయ్య నాయుడు బయటపెట్టారు. రాజకీయాల్లో వారసత్వ భావనను తాను ఎప్పుడూ ప్రోత్సహించలేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అదే కారణంతో తన కుమారుడు, కుమార్తెను రాజకీయ రంగంలోకి తీసుకురాలేదని తెలిపారు. పిల్లలకు మనం ఇచ్చే అసలైన సంపద ఆస్తులు కాదని, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలే నిజమైన వారసత్వమని ఆయన అభిప్రాయపడ్డారు. తన జీవితకాలంలో సంపాదించిన అనుభవం, సేవాభావానికి ప్రతీకగా స్వర్ణభారత్ ట్రస్ట్ను మాత్రమే వారసత్వంగా పిల్లలకు అప్పగిస్తున్నానని చెప్పారు. ఈ ట్రస్ట్ సేవలను భవిష్యత్తులో కొనసాగించాలని తన కుమార్తెకు సూచించినట్లు తెలిపారు.
అమరావతి అభివృద్ధికి..
హైదరాబాద్ నగర అభివృద్ధిని ప్రస్తావిస్తూ, అది దేశంలోనే ఒక అద్భుత నగరంగా ఎదిగిందని వెంకయ్యనాయుడు అన్నారు. అలాంటి సమగ్ర అభివృద్ధి నమూనా ఆంధ్రప్రదేశ్కు కూడా అవసరమని చెప్పారు. ప్రత్యేకంగా రాజధాని అమరావతి కూడా హైదరాబాద్ తరహాలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభిస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ సంక్రాంతి వేడుకల్లో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యంపై ప్రసంగించారు. పండుగల ద్వారా తరతరాలకు విలువలను అందించాల్సిన అవసరం ఉందన్న సందేశంతో ఈ కార్యక్రమం సాగింది.












Click it and Unblock the Notifications