రాజకీయ జన్మ.. పునర్జన్మ: కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మీదుగా టీఆర్ఎస్లో సురేఖ
ఇటీవలి కాలంలో రాజకీయ జన్మ, పునర్జన్మ గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు.
హైదరాబాద్: ఇటీవలి కాలంలో రాజకీయ జన్మ, పునర్జన్మ గురించి రాజకీయ నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. వాస్తవమేమిటంటే తమకు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచిన పార్టీని విస్మరిస్తూ స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
1995లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శాయంపేట మండల ప్రజాపరిషత్ (ఎంపిపి) అధ్యక్షురాలిగా ఎన్నికైన కొండా సురేఖకు రాజకీయంగా అవకాశం కల్పించిందీ కాంగ్రెస్ పార్టీ. నాటి వరంగల్ జిల్లా రాజకీయాల్లో అప్పటి వర్ధన్నపేట, ప్రస్తుత పాలకుర్తి శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావు మధ్య ఉప్పూనిప్పూగా ఉండేది.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (ఏపీపీసీసీ) అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అవకాశం కల్పించడంతో శాయంపేట అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా కొండా సురేఖ గెలుపొందారు.
నాటి నుంచి కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య ఆధిపత్య రాజకీయాలు నువ్వా? నేనా? అన్నట్లు సాగాయి. 2004, 2009ల్లోనూ వరుసగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన కొండా సురేఖకు రెండోదఫా వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు.
వైఎస్ రాజశేఖర రెడ్డికి గానీ, కొండా సురేఖకు గానీ రాజకీయంగా అవకాశాలు కల్పించిన పార్టీ కాంగ్రెస్ అన్న సంగతి అందరికీ తెలుసు. రాష్ట్రంలో పార్టీ అధినేతగా, సీఎల్పీ నాయకుడిగా, సీఎంగా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అదే బాధ్యత వైఎస్ రాజశేఖర రెడ్డి చేశారు. దానికి ఆయన కొంత సెంటిమెంట్ ప్లస్ ప్రజా సంక్షేమం జోడించారు. దాని పలితంగానే సాధారణ ప్రజల్లో ఇప్పటికీ ఆయన పట్ల అభిమానం కొనసాగుతున్నది.
కాంగ్రెస్ పార్టీలో ఇలా వైఎస్.. సురేఖ
రాజకీయ పార్టీ నాయకుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డికి అవకాశాలు వచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచే అన్న సంగతి ప్రస్తుత స్వార్థ పూరిత రాజకీయాల్లో తెర మరుగు కావడం ఇబ్బందికరంగా మారిందని అభిప్రాయ పడుతున్నారు. తాజాగా వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖకు ఇదే సూత్రం వర్తిస్తుందని చెప్తున్నారు. తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని వీడే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన రెడ్డి వైదొలిగిన నేపథ్యంలో ముందుకు వచ్చిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిన సంగతే.
పరకాల నుంచి ఎమ్మెల్యేగా తిరిగి ఇలా సురేఖ ఎన్నిక
‘మెగాస్టార్' చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనంచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన వైఎస్ జగన్మోహన రెడ్డికి మద్దతుగా ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసినందుకు కొండా సురేఖ అనర్హత వేటునకు గురయ్యారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరకాల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
జగన్తో కలిసి ఇలా సురేఖ పయనం
తెలంగాణకు వ్యతిరేకంగా సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ‘ఓదార్పు యాత్ర' పేరిట మహబూబాబాద్ పట్టణానికి బయలుదేరినప్పుడు జరిగిన రణరంగం సంగతి తెలంగాణ సబ్బండ వర్ణాల ప్రజలు విస్మరించలేదు. రైల్వే స్టేషన్ వేదికగా నెలకొన్న ఉద్రిక్తతలు, తెలంగాణ వాదులపై రువ్విన రాళ్లు.. ఓరుగల్లు నగరంలో స్థూపంగా ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయంటే అతిశేయోక్తి కాదు.
తెలంగాణ ఆవిర్భావ తేదీ తర్వాత ఇలా టీఆర్ఎస్లోకి..
2014లో తెలంగాణ ఆవిర్భావం పూర్తయ్యే నాటికి రాజకీయ భవితవ్యం కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కొండా సురేఖ తిరిగి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. కానీ నెల కూడా తిరగకుండానే.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ ఖరారైన తర్వాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఎంపికైన పిమ్మట రాజకీయ పరిణామాలు మారుతున్న సంగతి పసిగట్టారు కొండా సురేఖ.
టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నో
2014లో వరంగల్ జిల్లాలో దూకుడుగా దూసుకెళ్లే రాజకీయ నేతల అవసరం ద్రుష్ట్యా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన కొండా సురేఖ టీఆర్ఎస్ లో చేరడం.. వరంగల్ తూర్పు స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం వెంటవెంటనే జరిగిపోయాయి. కానీ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశలు అడియాసలయ్యాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యత స్వీకరించమని పార్టీ అధిష్ఠానం కోరితే తనకు మంత్రి పదవి కావాలని తేల్చేసిన నేపథ్యం కొండా సురేఖకు ఉన్నది.
కాంగ్రెస్ టూ టీఆర్ఎస్పై కొండా సురేఖ ఇలా
2019 ఎన్నికల నాటికి పరిస్థితులు ఊహించడం కష్ట సాధ్యంగానే ఉన్న తరుణంలో ముందస్తుగానే కొండా సురేఖ తిరిగి కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరనున్నదని వార్తలొచ్చాయి. ఈ వార్తలను ఖండించడానికేనన్నట్లు ఆమె ప్రతిస్పందించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైఎస్ఆర్ తనకు రాజకీయంగా జన్మనిస్తే.. కేసీఆర్ పునర్జన్మనిస్తారని ఆమె వ్యాఖ్యానించారు. తొలుత కాంగ్రెస్ పార్టీ... ఆ పై వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో ఆయన కొడుకు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఆవిర్భావంతో తిరిగి కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన సురేఖ తాజాగా రాజకీయ జన్మ, పునర్జన్మ అని కబుర్లు చెప్తుండటం విచిత్రంగానే ఉన్నదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.