ఉద్యోగుల్లారా .. పారాహుషార్ : నిబంధనలను దాటితే వేటే ?
నారాయణఖేడ్ : మరో వారం రోజుల్లో సార్వత్రిక సమరం జరగనుంది. ఓటరు దేవుళ్లను ఆకట్టుకోవడానికి నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో రాజకీయ నేతలు, వారి అనుయాయులు ఓకే .. ఉద్యోగులు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ఈసీ హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసినా తాట తీస్తామని స్పష్టంచేసింది.
సన్మానించిన చర్యలు తప్పవు ?
దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. వారు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల తరఫున పొరపాటున కూడా ప్రచారం చేయొద్దు. ఇక ప్రచార సమయంలో తమ వద్దకొచ్చే నేతలను సన్మానించేందుకు కూడా ఉద్యోగులు ఆసక్తి చూపిస్తుంటారు. అలా కూడా వ్యవహరించొద్దని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.
ఈసీ చేతిలో బ్రహ్మస్త్రం
సాధారణంగా ఉద్యోగులు రాజకీయ నేతలకు పరోక్షంగా మద్దతు తెలుపడం, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయడం, సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇలాంటి చర్యలను నిరసిస్తూ తన చేతిలో ఉన్న బ్రహ్మస్త్రాన్ని ఎన్నికల సంఘం ప్రయోగించింది. 23 (ఐ) నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. పై చర్యలను ఉద్యోగులు చేస్తే ఈ నిబంధన కింద ఈసీ చర్యలు తీసుకుంటుంది. వాస్తవానికి 1949 సెప్టెంబర్ 17 నుంచి ఈ నిబంధన ఉన్నా .. ఇటీవల కాలంలో ఉద్యోగులు మితిమీరి ప్రవర్తించడంతో మరోసారి తమ అస్త్రాన్ని ఈసీ బయటకు తీసింది.
23 (ఐ) పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులు
ఈ నిబంధన పరిధిలోకి అన్ని ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. వారు నిబంధనలను అతిక్రమించి, రాజకీయ పార్టీలకు సహకరించినట్టు రుజువైతే ఈ నిబంధన కింద ఈసీ చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా క్యాంపెయిన్పై కూడా ఈసీ డేగకళ్లతో పర్యవేక్షిస్తోంది.