సికింద్రాబాద్లో దేశంలోనే అతి పెద్ద ఉక్కు వంతెన.. డబుల్ డెక్కర్ కారిడార్
తెలంగాణ అత్యంత అరుదైన రికార్డును సృష్టించబోతోంది. దేశంలోనే తొలిసారిగా అత్యంత పొడవైన ఉక్కు వంతెనను నిర్మించబోతోంది. నగరంలోని ప్యారడైజ్ సెంటర్ నుంచి శామీర్ పేట వరకు దీన్ని నిర్మిస్తారు. ప్యారడైజ్ సెంటర్ నుంచి శామీర్ పేట వరకు 18.10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం ఉక్కు వంతెన నిర్మించటమంటే ప్రభుత్వం చాలా సాహసం చేస్తోందంటున్నారు. దీన్ని నిర్మించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను ఆహ్వానించింది. వీటిల్లో ఖరారైన కంపెనీ త్వరలోనే పనులు ప్రారంభించనుంది.
12 కిలోమీటర్లు ఉక్కునే వాడతారు
ఈ ఎలివేటెడ్ కారిడార్ 1 ను ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు నిర్మిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తికాగా మట్టిని పరీక్షించే పనులు జరుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ 2 ను జేబీఎస్ నుంచి హకీంపేట మీదుగా శామీర్ పేట వరకు నిర్మిస్తారు. దీనికి 2232 కోట్ల రూపాయల ఖర్చు కానుంది.

ఉత్తర తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ చాలా దారుణంగా ఉండటంతో కష్టాలు తప్పడంలేదు. మొత్తం కారిడార్ లో 11.65 కిలోమీటర్లు మాత్రం పూర్తిగా ఉక్కునే వాడతారు. పునాదులను మాత్రం కాంక్రీట్ తో వేస్తారు. 5.32 కిలోమీటర్లు మాత్రం డబుల్ డెక్కర్ కారిడార్ వస్తుంది. రక్షణ శాఖకు చెందిన 113 ఎకరాలు, ప్రయివేటు భూములు 84 ఎకరాలు సేకరిస్తున్నారు.
డిజైన్ ఖరారు చేసిన అధికారులు
ఉక్కుతో చాలా పటిష్టంగా ఉండేలా, తక్కువ సమయంలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రణాళిక రూపొందించి డిజైన్ కూడా ఖరారు చేశారు. మొత్తం ఈ మార్గంలో ప్యారడైజ్ నుంచి ప్రారంభమై వెస్ట్ మారేడుల్లి, కార్ఖానా,తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా శామీర్ పేటకు వెళుతుంది. హకీంపేట ఆర్మీ ఎయిర్పోర్టు సమీపంలో 450 మీటర్ల మేర అండర్గ్రౌండ్ టన్నెల్ నిర్మిస్తారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడంతో పనులు చాలా వేగంగా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications