తిరగొద్దు, నేనే మాట్లాడ్తా: పారిశ్రామికవేత్తలకు కేసీఆర్
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు తన నియోజకవర్గమైన గజ్వెల్లోని ముప్పిరెడ్డిపల్లిలో ఇన్సులిన్ పరిశ్రమ యూనిట్ ఏర్పాటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక నుండి పారిశ్రామికవేత్తలు కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం లేదని, తానే పారిశ్రామికవేత్తలతో చర్చించి, అనుమతులు ఇప్పిస్తానని చెప్పారు.
పదిహేను రోజుల్లో అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తామని చెప్పారు. పారిశ్రామికవేత్తలతో నేనే స్వయంగా చర్చిస్తానన్నారు. ఒక్క రోజు వ్యవవధిలోనే అనుమతి అనుమతి పత్రాలను అందించేందుకు కూడా కృషి చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం అవసరమైన అన్ని అప్లికేషన్లను వెబ్ సైట్లో పెడతామన్నారు.
అవినీతికి తావులేకుండా పారిశ్రామిక విధానం తీసుకు వస్తామన్నారు. పెట్టుబడిదారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తనతో ఇన్సులెన్ యూనిట్ ప్రారంభింప చేస్తున్నందుకు తాను శాంతా బయోటెక్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. శాంతా బయోటెక్ వర ప్రసాద్ రెడ్డి ఎన్నడు స్వార్థం కోసం పని చేయలేదన్నారు. కలరా మహమ్మారిని తరమి కొట్టిన ఘనుడు అన్నారు.
ప్రస్తుతం ఈ ఇన్సులెన్ కంపెనీ ఐదు వందల మందికి ఉపాధి కల్పిస్తుందని, భవిష్యత్తులో రెండువేల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. వర ప్రసాద్ రెడ్డి ఎప్పుడు లాభాపేక్ష లేకుండా పని చేస్తారన్నారు. వర ప్రసాద్ రెడ్డిలాంటి కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి అవసరమన్నారు.
రూ.850 ఖరీదు చేసే ఇన్సులెన్ రూ.150కే అందించేందుకు ముందుకొచ్చారన్నారు. ఆయనకు తెలంగాణలో ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ప్రపంచ ఆదర్శనీయుల్లో ఒకరన్నారు. కాగా, మెదక్ జిల్లా ముప్పిరెడ్డిపల్లిలో రూ.460 కోట్లతో ఈ యూనిట్ ప్రారంభిస్తున్నారు. దీనిని ఫ్రెంచ్ సాంకేతిక పరిజ్ఞానంతో తెస్తున్నారు.
హరీష్ రావుకు మిచిగాన్ విశ్వవిద్యాలయం ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు అమెరికా మిచిగాన్ విశ్వవిద్యాలయం నుండి ఆహ్వానం అందింది. మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించాలని ప్రతినిధులు లేఖలో కోరారు. ఈ మేరకు హరీష్ రావుకు లేఖ పంపారు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఆయన వెళ్లనున్నారు. హరీష్ రావు ఆ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.