పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం, ఏకాంతంగా ఆరా తీసిన కెసిఆర్
ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆదివారం నాడు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కెసిఆర్ దంపతులను ఆశీర్వదించారు.
అనంతపురం/హైదరాబాద్: ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆదివారం నాడు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కెసిఆర్ దంపతులను ఆశీర్వదించారు.
తొలుత వేదిక వద్దకు చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వెంటాపురానికి చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా వివాహ వేదిక వద్దకు చేరుకొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
పరిటాల శ్రీరామ్ పెళ్లికి భారీ బందోబస్తు: చంద్రబాబు-కెసిఆర్ కలవరా?
తన కుమారుడి వివాహ వేడుకకు విచ్చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంత్రి సునీత వేదిక వద్దకు సాదరస్వాగతం పలికారు. కేసీఆర్తో పాటు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వివాహానికి హాజరయ్యారు.
పరిటాల శ్రీరామ్ పెళ్లిలో ఆసక్తికర సన్నివేశం
ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కెసిఆర్ టిడిపి నేత పయ్యావుల కేశవ్తో ఏకాంతంగా సమావేశమయ్యారు. దాదాపు ఐదారు నిమిషాలు ఇరువురు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారని తెలుస్తోంది.
నంద్యాల, కాకినాడల్లో టిడిపి గెలుపుపై కెసిఆర్ ఆరా
నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు, కాకినాడ మున్సిపాలిటీలో అధికార పార్టీ జెండా ఎగురవేసిన అంశంపై కెసిఆర్.. పయ్యావుల నుంచి ఆరా తీశారని తెలుస్తోంది. ప్రస్తుత ఏపీ రాజకీయాలపై పయ్యావులను అడిగి తెలుసున్నారని సమాచారం.
తెలంగాణ అంశాలపై ప్రస్తావన
నంద్యాల, కాకినాడలలో టిడిపి వ్యూహాల పైన కెసిఆర్ అడిగినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చిందని సమాచారం.
టిడిపి గెలుపుపై అందుకేనా,
కాగా, త్వరలో నల్గొండ ఎంపీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామా చేయించి, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ను గెలిపించుకొని, అధికార పార్టీ సత్తా చూపించాలని కెసిఆర్ భావిస్తున్నారు. నంద్యాలలో టిడిపి గెలుపు తర్వాత ఆయనకు ఆ ఆలోచన వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఏపీలో టిడిపి గెలుపుపై ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది.