కెసిఆర్ వద్ద మంత్రదండముందా, నాకూ చెప్పండి!: ఛత్తీస్గఢ్ సిఎం రమణ్ ఆరా
హైదరాబాద్: తెలంగాణలో శాంతిభద్రతలు, విద్యుత్తు సమస్యలను అధిగమించడాన్ని చూసి ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఆశ్చర్యపోయారని, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వద్ద మంత్రదండం ఉంటే చెప్పాలని తనతో ఆయన స్వయంగా వ్యాఖ్యానించారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంతో దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ తొలి నాళ్లలో విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడింది. అయితే, ఏడాది తిరక్కుండానే పరిస్థితి తారుమారైంది. పట్టణాలతో పాటు మెజారిటీ పల్లెల్లో కోతలు లేని విద్యుత్ సరఫరా అమలైంది. విద్యుదుత్పత్తి పెరగలేదు, కొత్త ప్రాజెక్టులు రాలేదు.
అయినప్పటికీ రాష్ట్రం విద్యుత్ కొరత బారి నుంచి త్వరగా తేరుకుంది. దానికి కెసిఆర్ వల్లేనని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. విపక్షాలు మాత్రం... వర్షాలు లేక రైతులు కరెంట్ మోటార్లు వినియోగించడం లేదని ఇలాంటి కొన్ని కారణాల వల్ల విద్యుత్ వస్తుందని చెబుతున్నారు.

ఏదేమైనా విద్యుత్ సమస్య చాలానే తీరింది. ఈ విషయమై మహమూద్ అలీ హైదరాబాదు శివారులోని జలపల్లిలో జరిగిన అఖిల భారత ముస్లీం సమ్మేళనంలో మాట్లాడారు.
ఆయన పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరెంట్ కొరత తీర్చడం, శాంతిభద్రతల పైన రమణ్ సింగ్ తనను అడిగారన్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ వద్ద ఏదైనా మంత్రదండముందా? ఉంటే తనకు చెప్పాలని తనను స్వయంగా అడిగారన్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో జరుగుతున్న ముస్లీం సమ్మేళనానికి సౌదీ అరేబియా, ఆఫ్రికా దేశాల నుంచి ముస్లీం ప్రముఖులు హాజరవుతారని, పాకిస్తాన్ నుంచి మాత్రం ఎవరినీ ఆహ్వానించలేదన్నారు.












Click it and Unblock the Notifications