తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి బీజేపీ యత్నం చేస్తోందా? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలవర్షం!!
తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్క జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు, మరోపక్క తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్నయుద్ధానికి కొనసాగింపుగా జరుగుతున్న ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత ఉత్సవాల పేరుతో వేడుకలు నిర్వహించడం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రకటన చేసిన తర్వాతే జరుగుతుందని బిజెపి నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం
ఇక ఇదే సమయంలో బిజెపి నేతలపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా బీజీపీ నేతలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత స్వాతంత్రోద్యమంలో మీ పాత్ర ఏమిటి అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ సమైక్య ఉద్యమాల బిజెపి పాత్ర ఏమైనా ఉందా అని నిలదీశారు. అసలు తెలంగాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటో చెప్పాలంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు.
తెలంగాణాలో హోమంత్రి ఉన్న నేపధ్యంలో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్
ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో, వీటికి బీజేపీ, ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీజేపీ వాళ్లకు అలవాటైన "ఎన్నికల ఉత్సవాలు" అన్న సహజ సూత్రం అనుసారంగా రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రాష్ట్రాలకువచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే, వంచించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కవిత బిజెపి ని టార్గెట్ చేశారు.
దేశంలో ప్రజలకు హక్కులు కల్పించడానికి బీజేపీ చేసింది ఏమీ లేదు
తెలంగాణ బిడ్డగా, వీటి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నా అంటూ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. దేశంలో ప్రజలకు హక్కులు కల్పించడానికి బీజేపీ చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. సామరస్యం, ఏకత్వం, ప్రజాబలం ఇవే తెలంగాణ సీఎం కేసీఆర్ కు, తెలంగాణ రాష్ట్రానికి పునాది అని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం ఎప్పుడూ పోరాటం చేసే సీఎం కేసీఆర్ కు తెలంగాణ సమైక్యత దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.