విదేశాలకు వెళ్తారు కానీ, తెలంగాణకు రాలేరా?: మోడీపై కేటీఆర్
హైదరాబాద్: విదేశాలకు వెళ్లేందుకు కావాల్సినంత సమయం తీసుకుంటున్న ప్రధాని నరేంద్రమోడీ, కొత్తగా ఏర్పడిన తెలంగాణకు రావడానికి మాత్రం తీరికలేదని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ లో జరిగిన ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.
ఇతర పార్టీలకు నామినేషన్ల ముగింపు రోజు వరకూ అభ్యర్థులే దొరకలేదని ఆయన ఎద్దేవా చేశారు. వరంగల్కు వచ్చే ధైర్యం చేయలేకనే ప్రధాని మోడీ ముఖం చాటేశారని అన్నారు. హన్మకొండ నయీంనగర్లోని కందకట్ల గేట్ వే కాంప్లెక్స్లో ఆచార్య జయశంకర్ స్మారక సేవా సమితి, విద్యారణ్యపురి కాలనీ జేఏసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్ది పసునూరి దయూకర్ గెలుపునకు కృషిచేస్తామని కేటీఆర్కు హామీ ఇచ్చారు.
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం: పోచారం
వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. గురువారం ప్రచారంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పోచారం మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
రూ.17వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేశామన్నారు. ఇప్పటికే రూ.8వేల కోట్లకు పైగా రుణాలను చెల్లించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని తెలిపారు. వరంగల్ ఉపఎన్నికలో ఎక్కువ మెజార్టినీ సొంతం చేసుకువాలనే ఇంటింటికీ తిరుగుతూ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు.