మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు! రూమర్లను పట్టించుకోవద్దని మీడియాకు సూచన!
హైదరాబాద్ : దేశంలో ఎప్పుడు ఏ నగరంలో ఐటీ సాదాలు జరుగుతాయో చెప్పలేకుండా తయారయ్యాయి పరిస్థితులు. దేశంలోని పేరొందిన పట్టణాల్లో ప్రముఖు వ్యక్తుల ఇళ్లల్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. తాజాగా నేడు హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మేఘా ఇంజినీరింగ్ ఆండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు.
అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రభుత్వాల ముఖ్యమంత్రులు చేపడుతున్న, చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను ఈ కంపెనీయే నిర్మించింది. నిర్మిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంస్థ యజమానులు సన్నిహితులనే ప్రచారం కూడా ఉంది. ఇదిలాఉండగా తాజాగా మేఘా సంస్థ యజమానుల నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వివిధ మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, ఐటీ అధికారులు ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సోదాలను ఐటీ అధికారులు మొదలుపెట్టారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని కార్యాలయం, బాలానగర్ లోని కార్యాలయం, ఎంసీహెచ్ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే, దీనిపై మేఘా సంస్థ వివరణ ఇచ్చింది. తమ కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిజమని తెలిపింది. అయితే, ఇవి సాధారణ తనిఖీలు మాత్రమేనని ఐటీ శాఖ ప్రకటించింది.
ఈ తనిఖీలను సాధారణమైన అంశాలుగా మాత్రమే పరిగణించి, కవరేజీ విషయంలో అంత ప్రాధాన్యంగా తీసుకోవద్దని కొందరు జర్నలిస్టులను మేఘా సంస్థ ప్రతినిధులు కోరారు. ఫార్వర్డ్ మెసేజ్లను పట్టించుకోవద్దని కోరారు. అయితే, పలువురు జర్నలిస్టులు మాత్రం ఈ తనిఖీల్లో ఏదైనా ముఖ్యమైన సమాచారాన్ని ఐటీ అధికారులు గుర్తిస్తే, ఆ విషయం మేఘా సంస్థ వెల్లడిస్తుందా? ఈ తనిఖీలను వార్తగా భావించవద్దని తమకు ముందే సమాచారం ఇవ్వడం ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు.