టీకాంగ్రెస్ సీఎం అభ్యర్ధి ఎవరు - హైకమాండ్ కొత్త లెక్కలు..!!
తెలంగాణ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. సీఎం కేసీఆర్ ప్రచారంలో ముందున్నారు. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేత సీఎం అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మరి..కాంగ్రెస్ లో సీఎం అభ్యర్ది ఎవరు. తెలంగాణ ఎన్నికల బాధ్యత పూర్తిగా హైకమాండ్ తీసుకుంది. దీంతో..పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
బీఆర్ఎస్ - బీజేపీ క్లారిటీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచి కేసీఆర్ సీఎం అయ్యారు. మూడో సారి అధికారంలోకి వచ్చినా మరోసారి సీఎంగా కేసీఆర్ ఉంటారని పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణలో తామే కింగ్ మేకర్లం అవుతామని భావిస్తున్న బీజేపీ తాజాగా కీలక నిర్ణయం ప్రకటించింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ అభ్యర్ది సీఎం అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

దీంతో, కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నట్లుగా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్ది ఎవరనే చర్చ మొదలైంది. పార్టీ హైకమాండ్ సీఎం అభ్యర్దిపై నిర్ణయం తీసుకుంటుందని నేతలు చెబుతున్నా..ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ మాత్రం తమ పార్టీ నుంచి ఎవరు సీఎం అవుతారో స్పష్టం చేయటంతో..కనీసం ఏ వర్గానికి సీఎం పదవి ఇస్తారో చెప్పాలనే డిమాండ్ మొదలు పెట్టారు.
కాంగ్రెస్ లో కొత్త లెక్కలు : తెలంగాణలో సామాజిక సమీకరణాలు ఈ సారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ప్రధాన పార్టీలతో పాటుగా పోటీలో ఉన్న ఇతర పార్టీలు చీల్చే ఓట్లు..నియోజకవర్గాలు ముఖ్యమైన అభ్యర్దులుగా ప్రచారంలో ఉన్న వారి గెలుపు ఓటమలును డిసైడ్ చేయనున్నాయి. దీంతో, కాంగ్రెస్ పార్టీ గానే ఎన్నికల వ్యూహలు అమలు చేస్తోంది. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించినా..అనేక సమస్యలు పార్టీలో ఎదురయ్యాయి.
దీంతో, కర్ణాటక ఎన్నికల తరువాత నేరుగా హైకమాండ్ అన్నీ తామై తెలంగాణలో ఎన్నికల వ్యూహాలు..గ్యారంటీల ప్రకటన..అభ్యర్దుల ఖరారు వరకు వ్యవహరించింది. ఇక, ఎన్నికల ప్రచారంలోకి రాహుల్ , ప్రియాంక, డీకే శివకుమార్ లాంటి వారు తెలంగాణలో మొహరించి పార్టీని నడిపిస్తున్నారు. టీ కాంగ్రెస్ లో ఉన్న వర్గ పోరు..నేతల మధ్య విభేదాలు అధికారం దక్కించుకోవటానికి అవరోధం కాకుండా వ్యవహరిస్తోంది. కానీ, సీఎం ఏ వర్గానికి ఇస్తారనేది చెప్పటం మాత్రం సమస్యగానే మారుతోంది.

ఎవరి వైపు మొగ్గు : తెలంగాణ కాంగ్రెస్ లో జానారెడ్డి సీనియర్ గా ఉన్నారు. ఏడు సార్లు అసెంబ్లీకి ఎన్నికై సుదీర్ఘ కాలంగా మంత్రిగా పని చేసారు. కానీ, ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. అదే విధంగా రేవంత్ రెడ్డి, మల్లు భట్టి వికమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ లాంటి నేతలు రేసులో ఉన్నారు. కర్ణాటక గెలుపులో కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ ను పార్టీ నాయకత్వం డిప్యూటీ సీఎం ను చేసి సిద్దరామయ్యకు సమీకరణాల ఆధారంగా అవకాశం కల్పించింది. రేవంత్ దూకుడు ఉన్న నేత అయినా..ఎన్నికల సమయంలో మాత్రం హైకమాండ్ రేవంత్ పాత్రను పరిమితం చేసింది. బీజేపీ బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వటం..కేసీఆర్ గతంలో ఎస్సీని సీఎం చేస్తానని చేసిన ప్రకటన అమలు కాకవపోవటంతో కాంగ్రెస్ ఎస్సీకి అవకాశం ఇస్తుందా అనే చర్చ మొదలైంది.
ఇదే సమయంలో విధేయతను సైతం పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉందనే వాదన ఉంది. దీంతో, కాంగ్రెస్ తమ సీఎం ఏ వర్గం నుంచి ఉంటారో చెప్పటం కష్టంగా మారుతోంది. ఇప్పుడు చెప్పకపోయినా..అధికారంలోకి వస్తే మాత్రం ఈ నిర్ణయం పార్టీ హైకమాండ్ కు కత్తిమీద సాముగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications