టెర్రరిస్టులకంటే ప్రమాదకారి: బాబుపై జగదీష్ రెడ్డి, ఏపి సిఎం, డిజిపిపై ఫిర్యాదు
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో పోలీసులపై దాడిచేసిన టెర్రరిస్టులకంటే ఆంధ్రప్రదేశ్ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రమాదకారి అని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్లో మాట్లాడుతూ.. టీ న్యూస్కు నోటీసులు ఇవ్వడమంటే దొంగలే పోలీసులపై విచారణ మొదలు పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. తమిళనాడు, కర్ణాటక మీడియాలో ప్రసారం చేస్తే.. ఇదేవిధంగా అక్కడి మీడియాకు నోటీసులు ఇస్తారా? అని మంత్రి జగదీష్ ప్రశ్నించారు.
రెండురాష్ర్టాల మధ్య వైషమ్యాలు సృష్టించి కేసును పక్కదారి పట్టించే కుట్రలకు చంద్రబాబు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. ఇది చేసిన తప్పునుంచి బయటపడేందుకు చంద్రబాబు చేస్తున్న అధికార దుర్వినియోగమని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపి సిఎం, డిజిపిపై ఫిర్యాదులు
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు పాత్రను ప్రపంచానికి చూపిన టీ న్యూస్ టీవీ ఛానల్కు నోటీసులు ఇచ్చిన ఆంధ్రా పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్, సరూర్నగర్ పోలీస్స్టేషన్లలో తెలంగాణవాదులు శనివారం ఫిర్యాదులు చేశారు.
బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ శ్రీరంగారావు, కో కన్వీనర్ కొంతం గోవర్ధన్రెడ్డి తదితరులు ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీ రాముడు, విశాఖపట్నం ఏసీపీ రమణలపై ఫిర్యాదు చేశారు.
సరూర్నగర్ పోలీస్స్టేషన్లో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు కొంతం గోవర్థన్రెడ్డి, సీహెచ్ ఉపేంద్రలు, ఆల్ ఇండియా మైనార్టీస్, ఎస్సీ,ఎస్టీ సొసైటీ ఉపాధ్యక్షుడు హబీబ్ఖాన్, ప్రధాన కార్యదర్శి హసన్షరీఫ్ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.