‘కెసిఆర్! మాట మీద నిలబడితే రాజకీయ సన్యాసమే’
నల్గొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత జానారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, వ్యవసాయానికి ప్రాజెక్టుల ద్వారా రెండు పంటలకు నీరు, 10 లక్షల డబుల్బెడ్రూంలు కట్టిస్తానని ఎన్నికల్లో కెసిఆర్ హామీ ఇచ్చారని, ఆ హామీలను అమలుచేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని తేల్చి చెప్పారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నూకల వెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో డిసిసి అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య అధ్యక్షతన ఆదివారం సాయంత్రం జరిగిన మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
హామీలను అమలుచేయకపోతే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కెసిఆర్కు తగిన గుణపాఠం చెబుతానని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సకల జనుల గుండెచప్పుడును కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వినిపించి రాష్ట్రాన్ని తెచ్చామని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని రాస్తారోకోలు, ధర్నాలు చేసినా తెలంగాణ వచ్చేదికాదని ఆయన అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని, ఆత్మాభిమానం పెరుగుతుందని చెప్పి, తెలంగాణను ఇప్పిస్తే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో టిఆర్ఎస్ అవమానపరుస్తూ బలహీన పరుస్తోందని అన్నారు. అభివృద్ధి ముసుగులో టిఆర్ఎస్ అక్రమాలకు పాల్పడి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులంతా ఐక్యతతో ఉండి కార్యకర్తలకు కొండంత అండనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడినవారికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కెసిఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎండిపోయిందని అన్నారు.
కెసిఆర్ అవినీతిపరుడని, మిషన్ భగీరథ 30 నుండి 40 శాతం అధిక రేట్లకు టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డారని, ప్రధాన మంత్రికి, విజిలెన్స్ కమిటీకి లేఖ ద్వారా గుత్తా సుఖేందర్రెడ్డి ఫిర్యాదు చేశారని.. అలా ఫిర్యాదు చేసిన ఎంపి, టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో అత్యధిక మంది రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
కాంట్రాక్ట్లకు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి డబ్బులు ఉండగా రుణమాఫీకి, గృహాల బకాయిల చెల్లింపులకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాజ్యసభసభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, శాసనమండలి కాంగ్రెస్పక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, శాసనసభ పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ చీఫ్ విప్ ధీరాత్ భారతి రాగ్యానాయక్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.