తెలంగాణకేం చేశామో చెప్పాలా: వెంకయ్య, జితేందర్ కౌంటర్, బిజెపిపై 'తెలుగు' దాడి!
న్యూఢిల్లీ: లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదా పైన వాడిగావేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా అన్ని విధాలా సహకరిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని జితేందర్ రెడ్డి ఆరోపించారు. ఏపీతో సమానంగా తెలంగాణకు హామీలు అమలు చేయాలని ఆయన లోకసభలో డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు సమానంగా సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన పలు హామీలు ఇప్పటి దాకా నెరవేర్చలేదని ఆయన చదివి వినిపించారు. విభజన చట్టంలోని క్క హామీని అమలు చేయకుండా బిజెపి ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.

ఏపీకి ఎన్నో కేటాయిస్తున్న కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపిస్తోందని విరుచుకుపడ్డారు. ఆయన వెంకయ్యను అనుకరిస్తూ కౌంటర్ ఇచ్చారు. జితేందర్ రెడ్డికి మద్దతుగా టిఆర్ఎస్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, ఆ పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ కేంద్రం వైఖరికి నిరసన తెలిపారు.
దీనిపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ఘాటుగా స్పందించారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణకు ఏం చేశామో చెప్పేందుకు తాము సిద్ధమని సవాల్ చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభ, లోకసభలో మంగళవారం నాడు వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏపీకి ప్రత్యేక హోదా పైన నిలదీస్తున్నారు. మరోవైపు, తెలంగాణకు సహకరిస్తున్నామని చెప్పడంతో టిఆర్ఎస్ సభ్యులు కూడా ఎదురు దాడికి దిగారు. మొత్తానికి కేంద్రంపై తెలుగు రాష్ట్రాల సభ్యులు ముప్పేట దాడికి దిగారు.












Click it and Unblock the Notifications