జిట్టా బాలకృష్ణ కన్నుమూత: రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజులుగా యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. వెంటిలేటర్పై ఉన్న జిట్టా బాలకృష్ణా రెడ్డి ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
భువనగిరి పట్టణ శివారులోని తన ఫాంహౌస్లో జిట్టా అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. జిట్టా అకాల మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు సంతాపం తెలిపారు.

జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం తనకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాలకృష్ణారెడ్డి తనకు మిత్రుడని, సన్నిహితుడని చెప్పారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అని పేర్కొన్నారు.
అకాల మరణం చెందిన జిట్టా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు, బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. జిట్టా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాలకృష్ణారెడ్డి అకాల మరణం బాధాకరమన్నారు.
జిట్టా బాలకృష్ణ మృతి పట్ల కేసీఆర్ సంతాపం
బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి పట్ల ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సాధన పోరాటంలో జిట్టా క్రియాశీలకంగా పాల్గొన్నారని కేసీఆర్ తెలిపారు. మాజీ మంత్రలు కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు జిట్టా మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జిట్టా
తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణా రెడ్డి కీలక పాత్ర పోషించారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలు దఫాలుగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ.. ప్రజల పక్షాన, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడారు. జిల్లాలో ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఢిల్లీ, హైదరాబాద్, భువనగిరిలో తెలంగాణ సంస్కృతినీ, జాతరలను, ఉత్సవాలను నిర్వహించారు. గతంలో మూసీ ప్రక్షాలన కోసం పాదయాత్ర, బునాది గాని కాల్వ కోసం ఆమరణ నిరహార దీక్ష చేశారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో స్వంత ఖర్చులతో గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు.












Click it and Unblock the Notifications