సీసీఎస్ ఎదుట అవుట్లుక్ జర్నలిస్ట్: స్మితాపై ఆ ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్న
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్ను కించపరిచేలా కథనం రాసిన కేసులో భాగంగా విచారణను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వేగం పెంచారు. ఈ కథనాన్ని రాసిన అవుట్ లుక్ జర్నలిస్ట్ మాధవి టాటా మంగళవారం ఉదయం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
విచారణలో భాగంగా స్మితా సభర్వాల్పై కథనం రాయాల్సిన అవసరం ఏంటని, అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నలు సంధించారు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సీఎం క్యాంప్ ఆఫీసులో విధులు నిర్వహించేటప్పుడు స్మితా సభర్వాల్ ఎప్పుడూ నిండైన చీరకట్టుతో కనిపిస్తుంటారు.
అయితే ఆమె వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని ఓ ఫ్యాషన్ షోకు హాజరైంది. ఈ నేపథ్యంలో జీన్ ప్యాంట్ వేసుకున్నట్లున్న స్మితా క్యారికేచర్ను అవుట్ లుక్ పత్రిక ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై తన భార్య స్మితా సభర్వాల్పై అనుచిత కథనాన్ని ప్రచురించారంటూ అవుట్ లుక్ మ్యాగజైన్పై సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మంగళవారం విచారణకు హాజరైన వారిలో అవుట్ లుక్ మ్యాగజైన్ హైదరాబాద్ రెసిడెంట్ సహాయ ఎడిటర్ మాధవి టాటా, మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణ ప్రసాద్, కార్టూనిస్టు సాహిల్ భాటియా, అవుట్ లుక్ ప్రెసిడెంట్ ఇంద్రానిల్ రాయ్ తదితరులు సీసీఎస్ పోలీసుల వద్దకు తమ న్యాయవాదితో కలిసి హాజరయ్యారు.