జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు.. గెలుపెవరిది..?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11 న జరగనున్న విషయం తెలిసిందే. ఇక జూబ్లీహిల్స్ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఖరారు చేశారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం పేర్కొన్నారు. అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు కలిపి మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక మిగిలిన 58 మంది పోటీలో ఉన్నట్లు ఆర్వో తాజాగా వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం తాజాగా ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వీరిలో 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 23 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా.. మిగిలిన 58 మంది పోటీలో ఉన్నట్లు అధికారి వెల్లడించారు. అయితే జూబ్లీహిల్స్ కు ఇంతమంది పోటీ చేయడం ఈ నియోజకవర్గం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి భారీగా అభ్యర్థులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు.
2009 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బరిలో 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలో నిలిచారు. అయితే పోటీ మాత్రం ప్రధానంగా మూడు పార్టీల మధ్యే ఉంది. కాంగ్రెస్- బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఇక బీజేపీ సైతం జూబ్లీహిల్స్ లో విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతగా నవీన్ కు మంచి పేరు ఉంది. అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ కు బీసీ వర్గాల్లోనూ మంచి పట్టుంది. దీంతో విజయం తమదే అని కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది. దాదాపు 50 వేల మెజారిటీతో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ సైతం విజయంపై పూర్తి విశ్వాసంతో ఉంది.

తమ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ యత్నిస్తోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. 2023లోనూ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications