విషాదం: గచ్చిబౌలిలో 23వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: గత కొంత కాలంగా నిరాశ నిస్పృహలకు గురవుతున్న ఓ విద్యార్థిని సోమవారం భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నగరంలోని గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నానక్రాంగూడలోని మంత్రి సిలేస్టియా అపార్ట్మెంట్ 23వ అంతస్తులో మౌనిక సిన్హా, తన కూతురు ఇషా రంజన్(17)తో కలిసి ఉంటోంది.
ఇషా రంజన్ స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే, గత కొంతకాలంగా ఆమె తీవ్ర మనోవేదనతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందికి దూకింది. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇషా రంజన్ గతంలో కూడా పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వదినను హత్య చేసిన మరిది
భూ వివాదంలో వదినను మరిది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన షబానాబేగం భర్త జహంగీర్, మరిది యాకూబ్ ఖాజా మధ్య ఆదివారం రాత్రి భూమి విషయంలో గొడవ జరిగింది. దీంతో వారిద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. కాగా, షబానా బేగం మెడపై యాకుబ్ ఖాజా కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన షబానా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications