తెగ బాధపడిపోతున్నారు: డికె అరుణకు జూపల్లి కౌంటర్
హైదరాబాద్: శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి తమ పార్టీలో చేరినందుకు కాంగ్రెసు నేతలు జానా రెడ్డి, డికె అరుణ తెగ బాధపడిపోతున్నట్లున్నారని తెలంగాణ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం డికె అరుణ తండ్రి ఆశయాలనే నెరవేరుస్తోందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
కాంగ్రెస్ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తారని జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో ప్రజలు సీమాంధ్ర పార్టీలను బొంద పెట్టారని చెప్పారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు జానారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్కుమార్రెడ్డికి లేదన్నారు.
గతంలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో సీమాంధ్ర నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మీరెందుకు నోరు మెదపలేదని అడిగారు. గత రెండేళ్లలో జరిగిన ఏ ఎన్నికల్లోనైనా టీడీపీకి డిపాజిట్ దక్కిందా అని ప్రశ్నించారు.
టీడీపీకి డిపాజిట్ లేకుండా ప్రజలే తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. టీడీపీని ప్రజలే వద్దనుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని చెప్పారు. యావత్ దేశం అబ్బురపడే విధంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోడీ కూడా అభినందిస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయని కృష్ణారావు విమర్శించారు. భిక్షగాళ్లను సైతం దోచుకునే నైజం కాంగ్రెస్ నేతలదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తరతరాలకు తరగని డబ్బు సంపాదించుకున్నారని, కాంగ్రెస్ నేతలు అధికారం, పదవులే పరమావధిగా బతికారని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికిని చాటుకునేందుకే పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జూపల్లి చెప్పారు.