రైతు వేషంలో ఆకట్టుకున్న కేఏ పాల్ .. మునుగోడులో రోజుకో గెటప్ లో రచ్చ!!
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడటంతో మునుగోడు ఉపఎన్నికను సీరియస్ గా తీసుకొని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడులో జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ మాత్రం తగ్గకుండా కే ఏ పాల్ రచ్చ చేస్తున్నారు. మునుగోడు లో గెలిచేది నేనే అంటూ కే ఏ పాల్ తెగ ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో రచ్చ చేస్తున్నారు. ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కే ఏ పాల్ తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో తనకు తారసపడిన ఇతర పార్టీల అభ్యర్థులను సైతం తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక తానె కాబోయే సీఎం అంటూ, మునుగోడును అమెరికా చేస్తానంటూ ఆయన చేస్తున్న ప్రచారం అందరిలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది.
రైతు వేష ధారణలో కేఏ పాల ఎన్నికల ప్రచారం
తాజాగా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేస్తూ స్టెప్పులేసిన కె ఏ పాల్, రోజుకో రకమైన గెటప్లో చిత్రవిచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రజలకు చెబుతున్నారు. మొన్నటికి మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన కేఏ పాల్, తాజాగా రైతు వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకొని, రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు. వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు.
కెసిఆర్ కు ఓటు వేస్తే అభివృద్ధి జరగదన్న కేఏ పాల్
తన మాటలతో నవ్వించాడు. రైతుల సమస్యలను తాను పరిష్కరిస్తానని కె ఏ పాల్ హామీ ఇచ్చారు. పొరపాటున కూడా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని కె ఏ పాల్ చెప్పారు. కెసిఆర్ కు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని కె ఏ పాల్ వెల్లడించారు. కాంగ్రెస్, బిజెపిలు అధికారంలోకి వచ్చినా ప్రజలకు చేసేది ఏమీ లేదని కే ఏ పాల్ తెలిపారు. కేవలం ఓట్ల కోసం మద్యం పంపిణీ చేస్తున్నారని, విచ్చలవిడిగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని కేపాల్ ఆరోపించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ధర్మం వైపు ఉంటారని పేర్కొన్న కే ఏ పాల్ ప్రజలు తనను గెలిపిస్తారన్నారు.
మునుగోడులో వార్ వన్ సైడే అంటున్న పాల్ తగ్గట్లేదుగా
తన ప్రచారాన్ని అడ్డుకోవడానికి కెసిఆర్ స్వయంగా పోలీసులను రంగంలోకి దించారని, ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని కె ఏ పాల్ విమర్శించారు. ఇక తనను ఎవరూ ఆపలేరని పేర్కొన్న కే ఏ పాల్ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకు ఓటు వేయాలని తెలిపారు. మునుగోడు లో తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్న ఆయన మునుగోడులో వార్ వన్ సైడే నని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడును అభివృద్ధి చేస్తానని, యువత అందరికీ ఉద్యోగాలు ఇస్తానని, మునుగోడు అమెరికా చేస్తానని ఇప్పటికే మాట ఇచ్చిన కే ఏ పాల్ ఎన్నికల ప్రచారంలో తగ్గేదేలేదంటున్నారు.