కాళోజీ తెలంగాణ ఐకాన్: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
హైదరాబాద్: కాళోజీ తెలంగాణ ఐకాన్గా నిలిచారని, ఆయనను స్మరించుకోవడం మన బాధ్యత అని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. కాళోజీ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవశ్యకత ఉందన్నారు.
ప్రజల పక్షాన నిలబడి వారి కోసం ఆలోచించే మహోన్నత వ్యక్తి కాళోజీ అని, ఆయన స్టేట్స్మెన్లా మాట్లాడే వారని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజా పోరాటాలు, ఉద్యమాలు చేసే వారు ఓట్ల రాజకీయాల్లోకి రావద్దనే వారని, ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయన్నారు.
ప్రజాకవి కాళోజీ రచించిన ఇదీ నా గొడవ ఆత్మకథ పుస్తకాన్ని హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్, ప్రొఫెసర్ హరినాథ్, కవి, రచయిత ఎన్.వేణుగోపాల్ తదితరులు ఆవిష్కరించారు.
కాళోజీ ఫౌండేషన్ వరంగల్ చైర్మన్ నాగిల్ల రామశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులు కాళోజీని గుర్తు చేసుకున్నారు. కాళోజీ తమ ఇంటిపక్కనే ఉండేవారని, ఆయనంటే తనకు ప్రేమ, భక్తిభావం ఉండేదని చుక్కా రామయ్య అన్నారు.
ప్రజాస్వామిక విలువలు తెలిసిన మనిషి అని, కాళోజీ ఎన్నడూ రాజకీయాలను ప్రోత్సహించే వారు కాదని, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాలనే వారని, ఎందుకంటే ఓటర్లు చైతన్యవంతులవుతారని అంటుండేవారన్నారు.
వరంగల్ చౌరస్తా ప్రజలు రాజకీయాల గురించి ఏం మాట్లాడేవారో ఆయన అదే మాట్లాడే వారని, కాళోజీని స్మరిస్తే ప్రజాస్వామ్య విలువలు పెంపొందుతాయన్నారు. కాళోజీ స్మారకంగా ప్రభుత్వం వరంగల్లో భవన నిర్మాణానికి ముందుకు రావడం అభి నందనీయమన్నారు.
కాళోజీ ప్రజల మదిలో నిలిచిపోయిన వ్యక్తి అయినందున పూర్తిగా ప్రభుత్వమే కాకుండా ఆ భవన నిర్మాణంలో ప్రజలను సైతం భాగస్వాములను చేయాలన్నారు. ఒక శాశ్వత చిహ్నంగా భవనం నిలిచిపోవాలని, అది కళలకు నిలయంగా, రాజకీయ, సామాజిక అంశాలపై పరిశోధన కేంద్రంగా ఉండాలన్నారు.