దోస్తీ లేదు.. గీస్తీ లేదు!: మోడీపై కవిత తీవ్ర ఆరోపణలు, కోర్టుకెళ్తాం, రోడ్డుపై లాయర్ల భోజనం
హైదరాబాద్: నరేంద్ర మోడీ సర్కారు పైన తెలంగాణ సిఎం కెసిఆర్ కూతురు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ ప్రభుత్వంలో కవితకు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు నిన్నటి వరకు విమర్శించిన విషయం తెలిసిందే.
కల్వకుంట్ల కవిత గతంలో మాట్లాడిన తీరు కూడా అలాగే కనిపించిందనే వాదనలు ఉన్నాయి. అయితే, మోడీ ప్రభుత్వంపై కవిత శుక్రవారం నిప్పులు చెరగడం గమనార్హం.
మోడీ ప్రభుత్వం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుష్కర నిధుల కేటాయింపులోను ఆంధ్ర ప్రదేశ్కే ఎక్కువ ఇచ్చారన్నారు. తెలంగాణకు అన్యాయంపై తాము పార్లమెంటులో నిలదీస్తామని చెప్పారు.
తాము మోడీ ప్రభుత్వానికి అనుకూలమో లేక వ్యతిరేకమో కాదన్నారు. తాము తటస్థంగా ఉన్నామని చెప్పారు. బేగంపేట విమానాశ్రయాన్ని ఆర్మీకి అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు. దీని పైన మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు న్యాయం జరగదన్నారు.
హైకోర్టు వద్ద రోడ్డుపై న్యాయమూర్తుల భోజనం
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు ఎదుట బైఠాయించారు. తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందన్నారు. వారు హైకోర్టు ఎదుట రోడ్డు పైన బైఠాయించి, భోజనం చేసి నిరసన తెలిపారు.