జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్!.. ఎవరొచ్చినా తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్!!
Jubilee Hills By Election 2025: రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కీలక రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్ నేతలు ప్రతి డివిజన్ను చుట్టేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నిర్లక్ష్య ధోరణిని ప్రజలకు కళ్లకు కట్టేలా వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీష్ రావు లాంటి కీలక నేతలు చురుగ్గా పాల్గొంటున్నా.. పార్టీ అధినేత, మాజీ సీఎం మాత్రం ప్రచారానికి దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి సమర్ఫించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నా.. ఇప్పటివరకు ఆయన ప్రచారంలో పాల్గొనకపోవడం గమనార్హం.
కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారానికి రాకపోవడానికి వెనుక రెండు ప్రధాన కోణాలు ఉన్నాయని.. ఒకటి వ్యక్తిగత అహం, మరోది ఓటమి భయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తుండగా.. కేసీఆర్ కూడా ప్రచారానికి వెళ్తే అది రేవంత్ రెడ్డిని తనకు సమానంగా పరిగణించినట్లు అవుతుందని కేసీఆర్ భావిస్తూ ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. రేవంత్ రెడ్డిని మొదటి నుంచీ కేసీఆర్ తన కంటే తక్కువగానే చూసినట్లు... తన కుమారుడు, రాజకీయ వారసుడు అయిన కేటీఆర్ ప్రచారానికి వెళ్లడం రేవంత్ను ఎదుర్కోవడానికి సరిపోతుందని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అయితే, ప్రజలు ఇచ్చిన ముఖ్యమంత్రి హోదాను కేసీఆర్ గుర్తించకపోవడం రాజకీయంగా తప్పిదం అవుతుంది.

ఓటమి షాక్కు అవకాశం ఇవ్వకపోవడం
ఈ ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వస్తే అది కేసీఆర్కు మరో పెద్ద రాజకీయ షాక్ అవుతుంది. ఇప్పటికే వరుస ఓటములతో ఉన్న పార్టీకి ఇది మింగుడుపడని అంశం. ఒకవేళ కేసీఆర్ ప్రచారానికి రాకుండా బీఆర్ఎస్ ఓడిపోతే.. "కేసీఆర్ వచ్చి ఉంటే గెలిచేవాళ్లం" అని చెప్పుకోవడానికి పార్టీకి ఒక సాకు దొరుకుతుంది. ఇది ఓటమి ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ కేసీఆర్ రాకపోయినా బీఆర్ఎస్ గెలిస్తే, ఆ గెలుపు క్రెడిట్ పూర్తిగా కేటీఆర్కు దక్కుతుంది. తన రాజకీయ వారసుడికి క్రెడిట్ ఇవ్వడానికి ఇది ఒక సులభమైన వ్యూహంగా ఉపయోగపడుతుంది.
ప్రజల్లోకి వెళ్లే తప్పుడు సంకేతమిదే..
రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా కేసీఆర్ ప్రచారానికి రాకపోతే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు గద్దె దించడానికి ప్రధాన కారణం - నాయకులు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, దొరల తరహా పాలన కొనసాగించడం. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉండి, అసెంబ్లీకి కూడా రాలేదు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఉండి కూడా రాకపోతే.. అప్పటి ఇగో, అప్పటి దొరతనం ఇప్పటికీ కొనసాగుతోందనని ప్రజలు భావించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ విమర్శలకు బలం: కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోలేదు అని చేసే విమర్శలకు మరింత బలం చేకూరుతుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ ప్రచారానికి వస్తారని భావిస్తున్నప్పటికీ, నవంబర్ 9లోపు ఆయన ప్రజల చెంతకు వచ్చి "తాను మారాను" అని అనిపించుకుంటారా, లేక కాంగ్రెస్కు విమర్శించే అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి.
జూబ్లీహిల్స్లో అటు వైపే మొగ్గు..
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. స్థానిక నేత అయిన నవీన్ యాదవ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు సమాచారం. "జూబ్లీ హిల్స్ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం" అని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతి సందు సందులో తన పాదయాత్రలో కలిసే ప్రజలతో ఆయన తన ఈ మంత్రాన్ని చెబుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థి, స్థానిక నేత అయిన నవీన్ యాదవ్ వైపే సర్వేలన్నీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుస్తాయని సర్వేలు పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications