అంతా కేసీఆరే చేశారు!: నగర వాసుల కళ్లల్లో ‘మెట్రో’ ఆనందం
ఔను అంతా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు పట్టాలెక్కబోతుండటంతో నగరవాసుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
హైదరాబాద్: ఔను అంతా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు పట్టాలెక్కబోతుండటంతో నగరవాసుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎందుకంటే.. మొదట నాగోలు నుంచి మెట్టుగూడ వరకు మాత్రమే మెట్రోను నడుపుతామని ప్రకటించడంతో.. ఆ మాత్రానికి మెట్రో ఎందుకన్న విమర్శలు వచ్చాయి.
Recommended Video
వివాదాలెందుకు? ఇది హ్యాపీ టైమ్: మెట్రోపై కేటీఆర్, 2.15ని.కి లాంచ్ చేయనున్న మోడీ
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రో అధికారులతో మాట్లాడి నగరంలోని ఆ చివర నుంచి ఈ చివరి వరకు ఉన్న మార్గంలో రైళ్లు తిప్పాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేగాక, అందుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీకి హామీ ఇచ్చారు. అయితే, నాగోలు నుంచి మియాపూర్ వరకు ఉన్న 30 కిలోమీటర్ల మెట్రో మార్గం ఒకే మార్గం కాదు. దీనిని రెండు కారిడార్లగా విభజించారు.
అది కేసీఆర్ ప్లానే
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరుకానున్న మోడీ చేతుల మీదుగా మెట్రోను ప్రారంభించాలని ప్లాన్ చేసింది కూడా కేసీఆరే. అయితే పనులు పూర్తి అయ్యే సూచనలు కనిపించకపోవడంతో మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ వరకు 12 కిలోమీటర్లు, నాగోలు నుంచి బేగంపేట వరకు 16 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తవుతాయని.. మొత్తం మార్గంలో తొలి విడతలో రైళ్లు నడపడం సాధ్యం కాదని అధికారులు తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగానే పనులు చేపట్టారు.
ప్రయోజనం శూన్యమని కేసీఆర్..
మెట్టుగూడ, మియాపూర్-ఎస్సార్ నగర్ మార్గాలు సిద్ధమై చాలా కాలం అయినా ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండదన్న కారణంతో ప్రారంభాన్ని వాయిదా వేశారు. మెట్రో పనులపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రోను సగం సగం నడపడం వల్ల ప్రయోజనం శూన్యమని అధికారులకు తేల్చి చెప్పారు.
కేసీఆర్ కీలక సూచనలు
బేగంపేట-ఎస్సార్ నగర్ మార్గాన్ని అందుబాటులోకి తెస్తే నాగోలు నుంచి అమీర్పేట వరకు 17 కిలోమీటర్లు, మియాపూర్-అమీర్పేట మధ్య 13 కిలోమీటర్ల ప్రయాణం అనువుగా ఉంటుందని, ఈ మేరకు పనులు చేపట్టి అక్టోబరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. అందులో భాగంగా అమీర్పేటలో నిర్మించిన ఇంటర్ చేంజ్ స్టేషన్ పనులను త్వరితగతిన చేపట్టాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
కేసీఆర్ ఆలోచన ఫలించి..
ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన మెట్రో అధికారులు ట్రాఫిక్ను మళ్లించి నాలుగు నెలలపాటు రాత్రింబవళ్లు శ్రమించి పనులను పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు ఫలించి నాగోలు నుంచి మియాపూర్ వరకు రైల్వే లైను అందుబాటులోకి వచ్చింది.
ప్రజల కోణంలో ఆలోచించిన సీఎం
ఒక వేళ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ఈ ఆలోచన చేయకుంటే తొలి విడతలో సగం దూరం ప్రయాణానికే పరిమితమయ్యేది. నగర ప్రజల కోణం నుంచి ఆలోచించిన కేసీఆర్.. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మంగళవారం మధ్యాహ్నం మన మెట్రో ప్రారంభం కానుంది. మెట్రో ద్వారా సుమారు రోజుకు 17లక్షల మంది ప్రయాణం సాగించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి తొలి విడత మెట్రో సేవలు అందుబాటులోకి వస్తుండటంతో నగరవాసికి ట్రాఫిక్ నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.