ఆ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం: షబ్బీర్ అలీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకెళ్లడం ఖాయమన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. సోమవారం కామారెడ్జిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏడాది ముందే రేవంత్రెడ్డి చెప్పారని తెలిపారు.
తాను, తన సతీమణి మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారని ఆరోపించారు. కొందరి బీఆర్ఎస్ మాజీ మంత్రుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. 'నేను నా భార్య మాట్లాడుకుంటున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నారు. బీఆర్ఎస్ మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ల సతీమణిలతో మాట్లాడుకున్నది విన్నారు. కేసీఆర్ చుట్టాలు మాట్లాడుకునేది కూడా ట్యాపింగ్ చేశారు. ఇది చాలా పెద్ద నేరం' అని షబ్బీర్ అలీ అన్నారు.

'కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు, ఆ కేసులో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్తారని నా నమ్మకం, విశ్వాసం. ప్రభుత్వ సలహాదారుగా నాకున్న సమాచారం ప్రకారం త్వరలో వీళ్లందరూ జైలుకు వెళ్తారు' అని అన్నారు షబ్బీర్ అలీ. ఏకంగా తాము ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమేనని, పోలీసు అధికారులే అంగీకరించారని షబ్బీర్ అలీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ యంత్రాంగాన్ని తన స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకుందని, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రభుత్వ వాహనాల్లో నగదు రవాణా చేసినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు ఒప్పుకున్నారన్నారు షబ్బీర్ అలీ.
మరోవైపు, బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ పై షబ్బీర్ అలీ విమర్శలు చేశారు. పదేళ్లుగా జహీరాబాద్కు బీబీ పాటిల్ చేసిందేమీ లేదని, అభివృద్ధి పనులు అసలే చేయలేదని షబ్బీర్ అలీ విమర్శించారు. రెండు సార్లు గెలిచినప్పటికీ కనీసం మండలాల పేర్లు కూడా బీబీ పాటిల్ కు తెలియవని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాలుగు నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తి చేశామని, ఈ ఏడాదిలోపు హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications