బాలకృష్ణ అడగడమే తరువాయి కెసిఆర్ ఇచ్చేశారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అడగడమే తరువాయి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆయన కోరిక తీర్చేశారు. బాలకృష్ణ ఇటీవల కెసిఆర్ను కలిసి నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఉన్న కొన్ని సమస్యల గురించి నివేదించారు.
కేసీఆర్ ఆ ఆస్పత్రి నిర్మాణాల్లో బీపీఎస్ కింద విధించవలసి ఉన్న 5.73 కోట్ల రూపాయలను మినహాయించేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఆ రకంగా కోరిన వరం తీర్చారు. బసవతారకం ట్రస్టు ఆధ్వర్యంలో బాలకృష్ణ నేతృత్వంలో నడనుస్తున్న కేన్సర్ ఆస్పత్రిలో ఇటీవలి కాలంలో సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు, కొత్తబ్లాకులు చేసేశారు.
వాటిని రెగ్యులరైజ్ చేయడం గురించి కొన్ని నెలల కిందట బాలకృష్ణ ప్రత్యేకంగా వెళ్లి కేసీఆర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఏమాత్రం వెనకాడలేదు. తాజాగా 5.73 కోట్ల మినహాయింపు ఇచ్చేస్తూ గురువారం నాడు జీవో ఇచ్చేశారు.
బాలకృష్ణ కెసిఆర్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో కలిశారు. అప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి కోసం కలిశారు.