ఢిల్లీలో కేసీఆర్: కేజ్రీవాలతోపాటు పలు కీలక భేటీలు, మరో ముందడుగు పడనుందా?
హైదరాబాద్/న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కీలక నేతలను సీఎం కేసీఆర్ కలిసిన విషయం తెలిసిందే.

ఢిల్లీలో కేసీఆర్.. కేజ్రీవాల్తో భేటీ..
సోమవారం రాత్రి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. కేసీఆర్ వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పలువురు అధికారులు ఉన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు కీలక నేతలు, ప్రముఖ వ్యక్తులతో భేటీ కానున్నారు.

జాతీయస్థాయిలో కేసీఆర్ ప్రత్యామ్నాయ వేదిక
జాతీయస్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో కేసీఆర్ భేటీలు నిర్వహించారు. తాజాగా, ఢిల్లీ పర్యటనలో ఇందుకు సంబంధించి మరో ముందడుగు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కేసీఆర్ సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ భేటీలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిపై చర్చించే అవకాశం ఉంది.

విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్లతోనూ కేసీఆర్ భేటీ
బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్న కేసీఆర్.. పలు జాతీయ పార్టీల నేలను కలుస్తారు. అంతేగాక, విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోనూ సమావేశం కానున్నారు. జాతీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగస్వాములు కావాలని వారిని కేసీఆర్ కోరనున్నారు. ఇందుకు సంబందించిన అంశాలపై వారితో చర్చించనున్నారు.
బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్లో చర్చలు జరిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండే స్టాలిన్, ఉద్ధవ్ థాక్రేలు ఈ కూటమిలో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

కేంద్రమంత్రులతోనూ భేటీ కానున్న కేసీఆర్
మరోవైపు, ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై కేంద్రమంత్రులను కూడా కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. గత నవంబర్ లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన సమయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు కలవలేదు. ఈసారి మాత్రం కేంద్రమంత్రులను కూడా కలవనున్నట్లు సమాచారం. ఉక్రెయిన్లోని భారత విద్యార్థులను స్వరాష్ట్రాలకు రప్పించడం, యాసంగి ధాన్యం కొనుగోలు, విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి కావాల్సిన నిధులపై వారితో చర్చించే అవకాశం ఉంది.
ప్రధానితో భేటీ ఉంటుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. ఇది ఇలావుండగా, ఢిల్లీ ఎయిమ్స్లో కేసీఆర్ సతీమణి శోభ వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్లు తెలిసింది. మొత్తంగా కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications