కెసిఆర్ అందమైన రైతు: మంత్రుల ఇలాకాల్లో లెక్క చెప్పిన అక్బర్, వరుణదేవుడంటూ...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసన సభలో మంగళవారం నాడు రైతు సమస్యల పైన చర్చ సందర్భంగా... మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అందమైన రైతు అని, రాష్ట్రంలోని మిగతా రైతులు కూడా అలాగే స్మార్ట్గా ఉండేలా చూడాలన్నారు.
రైతు ఆత్మహత్యలపై ఏటా సభలో మాట్లాడుతూనే ఉన్నామన్నారు. ఆత్మహత్యలు ఆపేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలన్నారు. తెలంగాణలో చాలా రైతు కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయన్నారు. రైతు ఆత్మహత్యలను ప్రభుత్వం తీవ్రంగా తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ఆత్మహత్యల పైన మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటన సరిగా లేదన్నారు. అన్నింటికీ వరుణ దేవుడిదే బాధ్యత అన్నట్లుగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. మంత్రులు, అధికారులు హైదరాబాదులో ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు. నెపాన్ని ప్రభుత్వం పూర్తిగా వరుణుడిపై నెట్టేస్తోందన్నారు.
మంత్రులు క్షేత్రస్థాయికి ఎందుకు వెళ్లడం లేదన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చాలా అందమైన రైతు అని, తెలంగాణ రాష్ట్రంలోని రైతులు అందరు కూడా అలాగే ఉండాలన్నారు. ఆత్మహత్యల నివారణకు అన్ని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
మంత్రుల నియోజకవర్గాల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తెలంగాణలో రైతు కుటుంబాలు చాలా అప్పుల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ రైతులు అందరూ కెసిఆర్లా స్మార్ట్గా మారాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల నియోజకవర్గాల వారీగా రైతుల ఆత్మహత్యలను వెల్లడించారు.
మంత్రుల నియోజకవర్గాల్లో మృతుల వివరాలు వెల్లడించిన అక్బరుద్దీన్... కెటిఆర్ (సిరిసిల్ల) 18, ఈటెల రాజేందర్ (హుజురాబాద్) 15, లక్ష్మా రెడ్డి (జడ్జర్ల) 15, హరీష్ రావు (సిద్దిపేట) 11, చందూలాల్ 12, జోగు రామన్న 10, శ్రీనివాస్ రెడ్డి 10, మహేందర్ రెడ్డి 10ల చొప్పున రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
ఈ ప్రభుత్వాన్ని అప్పుడు మెచ్చుకుంటా
రేపటి నుంచి ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడడని ప్రభుత్వం హామీ ఇస్తే.. నేను ఈ ప్రభుత్వం మంచిదని కితాబిస్తానని చెప్పారు. నెపాన్ని గత ప్రభుత్వాల పైకి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కిసాన్ కార్డుల విషయంలో ప్రభుత్వం తీరు దారుణమన్నారు.
కరువు మండలాలను ప్రకటించి ఉంటే బాగుండేది: లక్ష్మణ్
టిఆర్ఎస్ ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి ఉంటే రైతులకు ఊరట లభించి ఉండేదన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. వరిసాగు రాష్ట్రంలో సగానికి పైగా తగ్గిందన్నారు.