'పదవి లెక్కకాదంటూ చిన్నదాని కోసం టీఆర్ఎస్లోకి డీఎస్': కెసిఆర్కు స్వల్ప అస్వస్థత
హైదరాబాద్: డి శ్రీనివాస్ తనకు పదవి లెక్క కాదని చెబుతూనే.. తన హోదాను, చరిత్రను పక్కన బెట్టి చిన్న పదవి కోసం పార్టీని వీడారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క బుధవారం మండిపడ్డారు.
సమైక్య రాష్ట్రంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడిగా పని చేశారని, ఎంతోమందికి తన చేతుల మీదుగా ఎన్నికల బీ ఫాంలు ఇచ్చారని, మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని, కానీ పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ వీడటం ఏమిటని ప్రశ్నించారు.
డిఎస్ పార్టీ వీడటాన్ని ఆత్మవంచనగా పేర్కొన్నారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల ముందు కెసిఆర్ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. మైనార్టీలను ఏం చేసిన కాంగ్రెస్ తరఫున పోరాటం సాగిస్తామన్నారు.
కెసిఆర్ ఖమ్మం జిల్లా పర్యటన రద్దు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఖమ్మం, వరంగల్ జిల్లా పర్యటన వాయిదా పడింది. ఖమ్మం జిల్లా పర్యటన ఆరుసార్లు రద్దు కావడం గమనార్హం.