చంద్రబాబు వస్తున్నాడుగా: కేసీఆర్కి గవర్నర్, కేంద్రం వద్దకు సీఎం
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు భేటీ అయ్యారు. కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో చర్చించే అంశాలపై గవర్నర్ నరసింహన్తో ఆయన సమావేశమయ్యారు.
రాజ్భవన్కు వెళ్లిన కేసీఆర్ దాదాపు రెండు గంటల పలు అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజన, 10వ షెడ్యూల్ సంస్థల విభజన, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై చర్చించారు. నదీజలాలపై ఏపీ లేవనెత్తిన వివాదాలను గవర్నర్కు వివరించారు.
హైకోర్టు విభజన అంశం మీద ప్రధానంగా చర్చించారు. న్యాయవ్యవస్థ స్తంభించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడిన గవర్నర్.. ఢిల్లీ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా వచ్చే అవకాశమున్నందున, సానుకూల వాతావరణంలో ఇద్దరూ అక్కడే చర్చించుకొని అవగాహనకు వచ్చి, ఆ నిర్ణయాన్ని వెంటనే కేంద్రానికి తెలిపితే సమస్య పరిష్కారమవుతుందని కేసీఆర్తో అన్నారని తెలుస్తోంది.
కేంద్రంతో చర్చించే అంశాలు ఇవే..!
కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనలో కేంద్రంతో పలు అంశాలు చర్చించనున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, తొమ్మిది, పదో షెడ్యూల్ తదితర అంశాలపై చర్చించనున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీనిని కలిసి మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ఆహ్వానించే అవకాశముంది.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు, అదనపు కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి వెళ్తున్న కేసీఆర్, శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.
సోమవారం వరకూ ఢిల్లీలో ఉంటారు. తన పర్యటనలో న్యాయ, ఆర్థిక, పర్యావరణ, నీటిపారుదలశాఖల మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు. ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ర్టానికి సంబంధించిన అంశాలను చర్చించటంతో పాటు వచ్చే నెలలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్వయంగా ఆహ్వానించే అవకాశముంది.
శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నాక టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అవుతారు. శనివారం ఉదయం పది గంటల నుంచి రాష్ట్రపతి భవన్లో జరిగే అంతర్ రాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించే ఈ సమావేశం సాయంత్రం వరకు జరుగుతుంది. అనంతరం కేంద్రమంత్రుల్ని కలుస్తారు.
ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం ఉంటుంది. సోమవారం వరకూ ఢిల్లీలోనే ఉంటున్నందున ఈ వ్యవధిలో వీలునుబట్టి అయిదు శాఖల మంత్రులను కలవనున్నట్లు సమాచారం. ప్రధానంగా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల అమలుకు హోం మంత్రిత్వశాఖ నోడల్ ఏజెన్సీగా ఉన్నందున పెండింగ్ అంశాలపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి చర్చించే అవకాశముంది.
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే తదితరులను కూడా కలుస్తారు. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున పార్లమెంటులోనే వారిని కలిసే అవకాశముంది.
అభివృద్ధి కార్యక్రమాలకు కావలిసిన నిధుల కోసం రుణాలు తీసుకోవడానికి రుణ పరిమితిని(ఎఫ్ ఆర్బీఎం)ను పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరనున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన వివిధ బకాయిల అంశాన్ని మంత్రుల దృష్టికి తేనున్నారు.
గవర్నర్ నరసింహన్తో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాడు భేటీ అయ్యారు. కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో చర్చించే అంశాలపై గవర్నర్ నరసింహన్తో ఆయన సమావేశమయ్యారు.