వందశాతం హరీష్ మాట నిలబెడ్తా, 20 ఏళ్ల కింద అదే చెప్పా: కెసిఆర్, 'ఆ ముఠా వచ్చింది'
మెదక్: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల ప్రచార సభలో మంత్రి హరీష్ రావును బుల్లెట్ దూసుకెళ్తున్నాడంటూ కితాబిచ్చారు. అదే సమయంలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల పైన తీవ్రంగా మండిపడ్డారు. ఖేడ్ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడారు.
చావుదాకా వెళ్లి వచ్చా
నారాయణఖేడ్ చరిత్రలో ఇంత పెద్ద బహిరంగ సభ జరగలేదన్నారు. ఏపీలో తెలంగాణ అన్యాయానికి గురవుతోందన్న ఉద్దేశ్యంతోనే మనం ఉద్యమించామన్నారు. తెలంగాణ వస్తే రాష్ట్రం బాగుపడుతుందనే కొట్లాడామన్నారు. ఉద్యమం సమయంలో చావుదాకా వెళ్లి వచ్చానని చెప్పారు.
భగవంతుడి దయ వల్ల నేను చనిపోలేదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాలని, అందరూ చిరునవ్వులు నవ్వాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.35వేల కోట్లతో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
మనం ఇస్తున్నట్లు రూ.1000 పింఛన్ దేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా అన్నారు. ఈ పింఛన్ పైన నాయిని నర్సింహా రెడ్డి హర్షం వ్యక్తం చేశారన్నారు. అందుకే గ్రేటర్ హైదరాబాదులో మనం గెలిచామన్నారు. నారాయణఖేడ్లోను ఎంతోమంది ఈ పింఛన్ అందుకుంటున్నారన్నారు.
గత ప్రభుత్వాలు కుటుంబానికి సరిపోయే బియ్యాన్ని ఇవ్వకపోయేవన్నారు. ఇప్పుడు మేం కుటుంబంలో ఒకరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నామన్నారు. వికలాంగులకు రూ.1500 ఇస్తున్నామన్నారు. ఆటో ట్యాక్సీలకు, డ్రైవర్లకు.. ఇలా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. డ్రైవర్లకు బీమా ఇచ్చామన్నారు.
నాయి బ్రాహ్మణ సోదరులకు విద్యుత్ బిల్లులు తగ్గించామని చెప్పారు. ఈ రోజు దేశం ఆశ్చర్యపోయే విధంగా.. పేదవారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా.. ఇల్లు కట్టిస్తోంది తమ ప్రభుత్వమే అన్నారు. పేదలు సంతోషంగా ఉండేందుకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
కథలు చెప్పేందుకు రాలేదు
నేను ఇక్కడకు కథలు చెప్పేందుకు రాలేదని, చేసేదే చెప్పేందుకు వచ్చానని చెప్పారు. కాబట్టి అందరు ఆలోచించి ఓటు వేయాలన్నారు. నారాయణఖేడ్ ఇక్కడే ఉందా అని చాలామంది అంటున్నారని, ఇక్కడ స్వతంత్రం లేదని, కొన్నిచోట్ల ఓటు వేయనీయరని, గూండాగిరి చేస్తారన్నారు. మద్యం పోస్తారన్నారు.
అదంతా మరిచిపోవాలన్నారు. మీకు అద్భుతమైన మంత్రి ఉన్నారని హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. ఆయన బుల్లెట్లా దూసుకు పోతారని చెప్పారు. కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి ఖేడ్ కాళ్లు కడగుతానని చెప్పారు.
కెసిఆర్ మొండి ఘటం.. బక్కోడే తెలంగాణ తెచ్చాడు
కెసిఆర్ మొండి ఘటమని మీకు తెలుసునన్నారు. ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమం కోసం ముందుకు వస్తే.. తాను బక్కవాడిని కాంగ్రెస్, టిడిపి విమర్శించిందన్నారు. కానీ ఈ బక్కోడే తెలంగాణ సాధించాడన్నారు. మీకు మంచి మంత్రి హరీష్ రావు ఉన్నారన్నారు.
సిద్దిపేటలో ఖేడ్ను చేస్తానని హరీష్ రావు చెబుతున్నారని, వందకు వంద శాతం హరీష్ రావు మాటను నేను నిలబెడతానని చెప్పారు. ఖేడ్లో ఇప్పటి వరకు మార్కెట్ యార్డు కమిటీ ఎందుకు లేదన్నారు. ఇంత అధ్వాన్నంగా ఉంటుందా అని ప్రశ్నించారు. ఆసుపత్రి లేకపోవడం ఏమిటన్నారు.
ఇంకా నారాయణఖేడ్ ఇదే దరిద్రంలో ఉండాలా అన్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపిల ప్రభుత్వాన్ని చూశారని, ఇప్పుడు తమకు అవకాశమివ్వాలన్నారు. నాలుగు నెలలుగా హరీష్ రావు, తెరాస అభ్యర్థి భూపాల్ రెడ్డి ఏం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారన్నారు.
ఇక్కడే రెండు రోజులు ఉంటా
ఖేడ్ అభివృద్ధి జరగాలంటే భూపాల్ రెడ్డిని గెలిపించాలన్నారు. నేను ఇప్పుడు ఓ హామీ ఇస్తున్నానని.. ఎన్నికల తర్వాత నేను ఖేడ్కు వచ్చి రెండు రోజుల పాటు ఉండి, అన్ని పనులు స్వయంగా చేస్తానని చెప్పారు. ఢిల్లికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. నేను మీ బిడ్డనే.. మెదక్ జిల్లా బిడ్డనే అన్నారు.
నాదీ అంతే బాధ్యత
ఖేడ్ అభివృద్ధిపై హరీష్ రావుకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే బాధ్యత ఉందని చెప్పారు. ఏ పార్టీ గెలిస్తే ఖేడ్ అభివృద్ధి జరుగుతుందో ప్రజలు, మేథావులు అలోచించాలన్నారు. ఇరవై ఏళ్ల క్రితం బాబు మోహన్తో కలిసి నేను వచ్చానని, నాడు నేను ఏం చెప్పానో.. నేడు హరీష్ రావు అదే చెప్పవలసిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఇక్కడి తండాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మేం తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తున్నామని, పేదలకు కళ్యాణ్ లక్ష్మి పెట్టామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అమలవుతుందని చెప్పారు.
ముస్లీం సోదరులు ఖేడ్లో పెద్ద సంఖ్యలో ఉంటారని, వారు అన్నీ ఆలోచించి ఓటేయాలన్నారు. అరవై ఏళ్ల పరాయి పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు. ఇప్పుడు తెరాసకు ఓటు వేసి ఖేడ్ అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలిసి కూడా ఎవరూ గోయిలో పడవద్దని కోరారు.
ముళ్ల చెట్టు పెట్టి పండ్లు కాయమంటే కాయదన్నారు. గాడిదలకు గడ్డి వేసి పాలు ఇవ్వమంటే రావని ఇప్పుడే హరీష్ రావు చెప్పారని, కాబట్టి ఎవరిని గెలిపిస్తే న్యాయం జరుగుతుందో మీకు తెలుసన్నారు. నిన్నా మొన్న గ్రామాలకు వచ్చిన వారు నోట్లు పంచే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
అదే ముఠా ఇక్కడకూ వచ్చింది
ప్రపంచమంతా మేల్కొందని, ఖేడ్ మేల్కొనాలన్నారు. మేథావులు వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు. తప్పకుండా ఖేడ్లో కొత్త వెలుగు రావాలన్నారు. అందుకు బాధ్యత నాదే అన్నారు. మొన్న వరంగల్ ఉప ఎన్నికల్లో, నిన్న గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు షాకిచ్చారన్నారు.
అదే ముఠా మొన్న హైదరాబాదులో వీరంగం వేసిందని, కానీ హైదరాబాదులో మీరు ఫలితం చూశారన్నారు. ఒకరికి ఒకటి, ఇంకొకరికి రెండు సీట్లు వచ్చాయన్నారు. ఇప్పుడు అదే ముఠా నారాయణ ఖేడ్ వచ్చిందన్నారు. ఖేడ్లో తెరాస గెలుపు ఖాయమన్నారు.
తనకు ఓ విషయం తెలిసిందని.. కెసిఆర్కు ఓటు వేస్తామని చెబుతున్నారని, కానీ గుర్తు తెలియదంటున్నారని తెలిసిందని, మన గుర్తు కారు అన్నారు. మీరు కారు గుర్తుకు ఓటు వేస్తే ఏసీ కారులో ప్రయాణించినట్లుగా ఉంటుందన్నారు.
హరీష్ చెప్పినట్లు కాంగ్రెస్, టిడిపి డిపాజిట్లు గల్లంతు చేస్తే హరీష్ రావుకు వెయ్యి ఏనుగుల బలం వస్తుందన్నారు. ఖేడ్ అభివృద్ధి బాధ్యతను నేను తీసుకుంటున్నానని చెప్పారు. సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే ఖేడ్లో మన విజయం ఖాయమయిందని తెలుస్తోందన్నారు.